ప్రశాంత్‌ కిశోర్‌ సంపద ఎంత తెలుసా? భార్య ఆయనకంటే ధనవంతురాలు!

Prashant Kishor net worth details revealed as wife is richer than him
  • ప్రశాంత్‌ కిశోర్‌ ఆస్తుల విలువ రూ.96 కోట్లు
  • భార్య పేరిట రూ.100 కోట్లకుపైగా ఆస్తులు
  • తనపై ఎనిమిది కేసులు ఉన్నట్లు వెల్లడి
  • రూ.5.77 కోట్ల బ్యాంకు రుణం వివరాలు
  • బంకిపూర్‌ ఉప ఎన్నికకు నామినేషన్‌ దాఖలు
బీహార్‌లోని బంకిపూర్‌ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న జన్ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.96 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.22.19 కోట్ల విలువైన చరాస్తులు, రూ.73.87 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. ఆయన భార్య జాహ్నవి దాస్‌ పేరిట రూ.89.51 కోట్ల చరాస్తులు, రూ.12.42 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడైంది.

నామినేషన్‌ దాఖలు చేసే ముందు సోన్‌పూర్‌లోని బాబా హరిహర్‌నాథ్‌ ఆలయంలో ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇది కేవలం తన నామినేషన్‌ మాత్రమే కాదని, నేరచరిత్ర ఉన్న నేతలు అధికారానికి దూరం కావాలనే రాజకీయ మార్పు కోసం చేస్తున్న పోరాటమని వ్యాఖ్యానించారు.

అఫిడవిట్‌లో తనపై నమోదైన కేసుల వివరాలను కూడా ప్రశాంత్‌ కిశోర్‌ వెల్లడించారు. పరువునష్టం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, మోసం వంటి ఆరోపణలతో మొత్తం ఎనిమిది కేసులు నమోదైనట్లు తెలిపారు. అయితే వీటిలో ఏ కేసులోనూ ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్నారు. అలాగే తనపై రూ.5.77 కోట్ల బ్యాంకు రుణం కూడా ఉన్నట్లు వెల్లడించారు.

ప్రశాంత్‌ కిశోర్‌కు ఘజియాబాద్‌లో రెండు ఫ్లాట్లు, మరో రెండు ఫ్లాట్లలో 50 శాతం వాటా ఉంది. పట్నాలోని పాటలీపుత్ర కాలనీ, ఢిల్లీలోని వసంత్‌ విహార్‌, బక్సర్‌, స్వగ్రామంలో కూడా ఆస్తులు ఉన్నాయి. ఆయన భార్యకు గువాహటిలో రెండు ఫ్లాట్లు, ఒక బంగ్లాలో మూడో వంతు వాటాతో పాటు నోయిడాలో మరో ఆస్తి ఉంది. వేద వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ యజమానిగా ఉండగా, ఆ సంస్థ 2024-25లో జన్ సురాజ్‌కు రూ.85 కోట్ల విరాళం ఇచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Advertisement
Prashant Kishor
Jan Suraaj Party
Bihar By Elections
Prashant Kishor Net Worth
Jahnavi Das Assets
Election Affidavit

More Telugu News