మన్మోహన్ సింగ్ ఎందుకు ‘ఆత్మహత్య’ ప్రస్తావన తెచ్చారు? మాజీ సీఈసీ పుస్తకంలో ఆసక్తికర ఘటన!

Why did Manmohan Singh mention suicide interesting incident in former CEC book
  • ‘ఇండియా అండ్‌ ఐ: ఏ హండ్రెడ్‌ మెమొరీస్‌, నాట్‌ మెమైర్‌’ పేరిట ఎస్‌వై ఖురేషీ పుస్తకం
  • 2012 యూపీ ఎన్నికల నాటి ఆసక్తికర ఘటనను రాసుకున్న మాజీ సీఈసీ
  • మంత్రుల వ్యాఖ్యలు ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని అప్పట్లో ఖురేషీ ఆందోళన
  • అదే నిజమైతే ఆత్మహత్య చేసుకుంటానని మన్మోహన్‌ ఆవేదన
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎస్‌వై ఖురేషీ తన కొత్త పుస్తకం ‘India and I: A Hundred Memories, Not a Memoir’లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర సంఘటనను వెల్లడించారు. 2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘంపై కొందరు కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై తాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశానని, ఆ విషయం తెలుసుకున్న మన్మోహన్ సింగ్ తనను అత్యవసరంగా కలవాలని కోరినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ను 4.5 శాతం నుంచి 9 శాతానికి పెంచుతామని అప్పటి కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లో ఉన్న సమయంలో కొత్త హామీలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నాలుగు రోజుల పాటు ఇరు పార్టీల వాదనలు విన్న ఎన్నికల సంఘం ఖుర్షీద్‌ను తప్పుబడుతూ కఠిన చర్యలు తీసుకుంది. అనంతరం కొందరు కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘం అహంకారంగా వ్యవహరిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారని ఖురేషీ తెలిపారు.

ఎన్నికల సంఘంపై మంత్రుల వ్యాఖ్యలు సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని ఖురేషీ అప్పటి ప్రధానమంత్రి మీడియా సలహాదారు హరీష్ ఖరేకు వివరించారు. మరుసటి రోజే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో సాయంత్రం మన్మోహన్ సింగ్‌ను ఆయన కలిశారు. 

ఆ సందర్భంగా మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదనతో ‘‘హరీశ్‌ చెప్పింది నిజమైతే... మీరు అలా అనుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా’’ అని చెప్పారని ఖురేషీ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తన గురించి కాదని, కొందరు మంత్రుల ప్రవర్తన గురించేనని వివరించగా ‘‘నాకు ఈ విషయం అసలు తెలియదు. తెలిసి ఉంటే వారిని తీవ్రంగా మందలించేవాణ్ని. ఇకపై ఏ సమస్య ఉన్నా నేరుగా నాకు ఫోన్ చేయండి’’ అని మన్మోహన్ సింగ్ చెప్పినట్లు వెల్లడించారు.

‘‘ఎన్నికల సంఘం భారతదేశ గర్వకారణమే కాదు.. మన ప్రజాస్వామ్యానికి ఆత్మ. అది బలహీనపడితే మనం అన్నీ కోల్పోతాం’’ అని ఆ సమావేశంలో మన్మోహన్‌ సింగ్‌ చెప్పినట్లు ఖురేషీ వెల్లడించారు. ఆ భేటీ తర్వాత ఎన్నికల సంఘంపై రాజకీయ నాయకుల విమర్శలు పూర్తిగా ఆగిపోయాయని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పటికీ ఎంతో వినయంగా వ్యవహరించిన నాయకుల్లో మన్మోహన్ ఒకరని, అధికారాన్ని ఎంతో సున్నితంగా భావించిన వ్యక్తిగా ఆయన్ను ఖురేషీ తన పుస్తకంలో కొనియాడారు.
Advertisement
Manmohan Singh
SY Quraishi
Election Commission of India
India and I Book
Salman Khurshid
Model Code of Conduct

More Telugu News