గంటల్లోనే చెన్నై, ముంబై.. తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు: అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
- తెలంగాణ బుల్లెట్ ట్రైన్ హబ్గా అవతరించబోతోందన్న అశ్వినీ వైష్ణవ్
- హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటలో చేరుకోవచ్చన్న రైల్వే మంత్రి
- తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని వ్యాఖ్య
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైళ్లలో, ఏకంగా మూడు రూట్లు తెలంగాణకే దక్కడం విశేషమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ వల్లే రాష్ట్రానికి ఈ భారీ ప్రాజెక్టులు వచ్చాయని, రాబోయే రోజుల్లో తెలంగాణ దేశంలోనే ఒక పెద్ద బుల్లెట్ ట్రైన్ హబ్గా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విప్లవాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయాలు ఊహించని విధంగా తగ్గిపోతాయన్నారు.
ముఖ్యంగా, హైదరాబాద్ నగరవాసులకు ఈ రైళ్లతో ప్రయాణ కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయి. బుల్లెట్ రైలు ఎక్కితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం ఒక గంట పది నిమిషాల్లోనే చేరుకోవచ్చని రైల్వే మంత్రి వివరించారు. అలాగే వ్యాపార రాజధాని ముంబైకి రెండు గంటల ఇరవై నిమిషాలు, అటు చెన్నై నగరానికి కేవలం రెండు గంటల్లోనే దూసుకుపోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ దేశ రవాణా రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.
ఇదే గ్యాప్లో ఈ ప్రాజెక్టుల క్రెడిట్ కోసం కొందరు పాకులాడుతున్నారంటూ విపక్షాలపై మంత్రి మండిపడ్డారు. దీని పూర్తి క్రెడిట్ ప్రధాని మోదీకే దక్కుతుందని, గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో కేవలం రూ. 800 కోట్లు మాత్రమే ఇస్తే, తమ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే ఏకంగా రూ. 5000 కోట్ల రైల్వే నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. ఈ నిధుల వరద వల్లే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయనిస్పష్టం చేశారు.