రంగారెడ్డి జిల్లా హత్యలపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

Minister Seethakka shocked over Rangareddy murders orders strict action
  • షాబాద్, దైవాలగూడ ప్రాంతాల్లో ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్
  • తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారని కక్ష
  • బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే హత్యలు చేసిన వైనం
రంగారెడ్డి జిల్లా షాబాద్, దైవాలగూడ ప్రాంతాల్లో జరిగిన ఘోర హత్యల ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న మంత్రి, ఘటన వివరాలు తెలియగానే సంబంధిత పోలీస్ కమిషనర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి సమాచారం సేకరించారు. నిందితుడిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. 

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు తక్షణం సహాయం అందించాలని, మానసిక-సామాజిక తోడ్పాటు కల్పించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సూచించారు.మహిళలు, పిల్లల భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, నేరస్థులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని సీతక్క హెచ్చరించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు.

కేసు వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన దారుణ హత్యల వెనుక పోక్సో కేసు కక్ష ఉందని పోలీసు దర్యాప్తు వెల్లడైంది. నిందితుడు రాజ్‌కుమార్ (28) తనపై పోక్సో కేసు నమోదు చేసి జైలు పంపిన బాలిక, ఆమె తల్లి, నానమ్మను కత్తితో నరికి చంపాడు. అనంతరం తన భార్య సరిత (పార్వతి సరిత), 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడిని కూడా కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘోర ఉదంతంలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. గత మే 16న బాలికను వేధించాడని ఆమె తల్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి మే 26న రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం బెయిల్‌పై విడుదలైన వెంటనే ఈ దారుణం చేశాడని పోలీసులు తెలిపారు.
Advertisement
Seethakka
Rangareddy murders
Shabad mass murder
POCSO case revenge
Rajkumar Rangareddy case
Telangana Women Child Welfare Minister

More Telugu News