బంగ్లా సదస్సులో భారత దౌత్యవేత్త తెగువ.. తప్పుడు మ్యాప్‌పై అక్కడికక్కడే నిల‌దీసిన వైనం!

Indian diplomat courage at Bangladesh conference questioning wrong map on the spot
  • బంగ్లాదేశ్ సదస్సులో తప్పుగా భారత మ్యాప్ ప్రదర్శన
  • వెంటనే అభ్యంతరం తెలిపిన భారత దౌత్యవేత్త పూజా ఝా
  • జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టీకరణ
  • సోషల్ మీడియాలో పూజా ఝాపై వెల్లువెత్తిన ప్రశంసల జల్లు
  • సార్క్ పునరుజ్జీవంపై జరిగిన సదస్సులో ఈ ఘటన
బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో భారత పటాన్ని తప్పుగా చూపించడంపై భారత దౌత్యవేత్త ఒకరు అక్కడికక్కడే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చిత్రీకరించడాన్ని ఆమె వెంటనే నిరసించారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగమని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఆ అధికారిణి ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఢాకాలోని 'బంగ్లాదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్' (బీఐఐఎస్ఎస్‌) నిన్న‌ 'సార్క్ పునరుజ్జీవం' అనే అంశంపై ఒక సెమినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత్‌లో బంగ్లాదేశ్ మాజీ హైకమిషనర్ అహ్మద్ తారిఖ్ కరీం ప్రసంగిస్తూ ఒక మ్యాప్‌ను ప్రదర్శించారు. అందులో జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించారు.

సదస్సులో పాల్గొన్న ఢాకాలోని భారత హైకమిషన్ సెకండ్ సెక్రటరీ పూజా కుమారి ఝా వెంటనే కలుగజేసుకున్నారు. "సర్, ఇది తప్పుడు మ్యాప్. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం" అని స్పష్టంగా చెప్పారు. దీనికి కరీం స్పందిస్తూ, ఆ మ్యాప్‌ను "కేవలం ప్రాతినిధ్య ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించామని, ఇది అసలైన సరిహద్దులను సూచించదు" అని అన్నారు.

అయితే, పూజా ఝా అంతే మర్యాదపూర్వకంగా.. "నేను అర్థం చేసుకోగలను సర్, కానీ జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. ఇక్కడ దాన్ని తప్పుగా చూపించారు. అందుకే నేను ఈ విషయాన్ని ప్రస్తావించాలనుకున్నాను" అని తన వైఖరిని పునరుద్ఘాటించారు. దీంతో కరీం, ఆమెను మీరు భారతీయురాలా అని ప్రశ్నించగా, తాను భారత హైకమిషన్ అధికారిణిని అని ఆమె తనను తాను పరిచయం చేసుకున్నారు. "మీ పాయింట్ నోట్ చేసుకున్నాను" అని చెప్పి కరీం తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఈ ఘటన తర్వాత భారత ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న మ్యాప్‌పై అభ్యంతరం తెలపడం ద్వారా దేశ అధికారిక వైఖరిని పునరుద్ఘాటించడమే తమ ఉద్దేశమని భారత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుండగా, దౌత్యవేత్త పూజా ఝా ప్రదర్శించిన తెగువపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సదస్సుకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షమా ఒబేద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ సార్క్ పునరుజ్జీవం కోసం సభ్య దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని నొక్కిచెప్పారు.
Advertisement
Pooja Kumari Jha
Indian Diplomat Bangladesh Map
Jammu and Kashmir integral part
SAARC seminar Dhaka controversy
BIISS Bangladesh conference
Indian High Commission Dhaka

More Telugu News