హైదరాబాద్ విమానాశ్రయంలో సెప్టెంబర్ నుంచి కొత్త ఛార్జీలు?
- హైదరాబాద్కు వచ్చే విమాన ప్రయాణికులపై యూడీఎఫ్ ప్రతిపాదన
- విమానాశ్రయ విస్తరణ కోసమే ఈ కొత్త విధానం
- ప్రస్తుతానికి మొత్తం ఫీజులో మార్పు లేదు, భవిష్యత్తులో తగ్గే అవకాశం
- ఏఈఆర్ఏకు ప్రతిపాదనలు సమర్పించిన జీహెచ్ఐఏఎల్
- ఆమోదం లభిస్తే సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి ఛార్జీలు
ఈ నూతన విధానం ప్రకారం, ప్రస్తుతం కేవలం బయలుదేరే (డిపార్చర్) ప్రయాణికులపైనే విధిస్తున్న యూడీఎఫ్ను, ఇకపై డిపార్చర్ మరియు అరైవల్ ప్రయాణికుల మధ్య విభజించనున్నారు. దేశీయ ప్రయాణికులకు డిపార్చర్పై రూ. 580, అరైవల్పై రూ. 170 చొప్పున ఛార్జీలను ప్రతిపాదించారు. అలాగే, అంతర్జాతీయ ప్రయాణికులకు డిపార్చర్పై రూ. 1,150, అరైవల్పై రూ. 350 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే, దీనివల్ల ప్రయాణికులపై తక్షణమే భారం పడదు. ఏఈఆర్ఏ ఆమోదం లభిస్తే 2026 సెప్టెంబర్ 1 నుంచి జారీ చేసే టికెట్లపై మాత్రమే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
భవిష్యత్తులో విమానాశ్రయంలో పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ విస్తరణ పనులు చేపట్టాలని జీఎంఆర్ భావిస్తోంది. రానున్న మూడేళ్లలో సుమారు రూ. 13,975 కోట్ల వ్యయంతో నూతన ప్యాసింజర్ టెర్మినల్, అదనపు రన్వే వంటి నిర్మాణాలు చేపట్టనుంది. ఈ విస్తరణ పనులకు అవసరమైన నిధుల సమీకరణ కోసమే యూడీఎఫ్ విధానాన్ని కొనసాగించడం అనివార్యమని జీఎంఆర్ తన ప్రతిపాదనలో పేర్కొంది. అయితే, 2030-31 నాటికి ఈ ఛార్జీలను తగ్గించే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఏఈఆర్ఏ పరిశీలనలో ఉంది.