‘కోట్లాది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశం’.. రామాలయ ట్రస్ట్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
- విరాళాల వివాదంపై నృత్య గోపాల్ దాస్ ఆవేదన
- దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్
- రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి
- నేడు ట్రస్ట్ కీలక సమావేశం
- రాజీనామాలు, సిట్ నివేదికపై చర్చ
‘‘శ్రీరామలల్లా ఆలయంలో భక్తుల విరాళాలు చోరీకి గురయ్యాయన్న విషయం తీవ్ర వేదన కలిగిస్తోంది. ఈ పాపానికి పాల్పడిన ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యాయం చేస్తారనే పూర్తి నమ్మకం నాకు ఉంది’’ అని నృత్య గోపాల్ దాస్ పేర్కొన్నారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో దీనిపై ఎలాంటి రాజకీయాలు చేయరాదని గోపాల్ దాస్ సూచించారు.
విరాళాల లెక్కింపులో అక్రమాల ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావణిలో ట్రస్ట్ అత్యవసర సమావేశం జరగనుంది. దీంట్లో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే విరాళాల లెక్కింపుపై సిట్ మధ్యంతర నివేదిక, ఆలయ భవిష్యత్ నిర్వహణ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ పూర్తికాని ఆదాయ-వ్యయ ఖాతాలు, బ్యాలెన్స్ షీట్ తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు.
ట్రస్ట్ నిబంధనల ప్రకారం చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదించాలంటే ట్రస్ట్ సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. సమావేశానికి ఎంతమంది సభ్యులు హాజరవుతారన్నదానిపై తుది నిర్ణయం ఆధారపడనుంది.