E20 పెట్రోల్‌పై మహీంద్రా క్లారిటీ.. పాత కార్ల యజమానులకు గుడ్‌న్యూస్‌

Mahindra clarity on E20 petrol good news for old car owners
  • ఈ20తో తమ కార్లు సేఫ్‌ అన్న మహీంద్రా
  • కొత్త మోడళ్లను ప్రత్యేకంగా తయారు చేసినట్లు వెల్లడి
  • పాత కార్లలోనూ ఈ20 ఇంధనం వినియోగించుకోవచ్చని స్పష్టీకరణ
  • మైలేజ్‌లో స్వల్ప మార్పు ఉండొచ్చని వివరణ
  • ఇంజిన్‌కు నష్టం ఉండదన్న కంపెనీ
ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది దీనివల్ల వాహనాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వాదిస్తున్నారు. సోషల్‌ మీడియాలో చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఈ20 వల్ల కేవలం మైలేజ్‌ మాత్రం కాస్త తగ్గుతుందని చెబుతోంది. అంతకు మినహా వాహనాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేస్తోంది. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా స్పందించింది. 

తమ పెట్రోల్‌ కార్లలో ఈ20 ఇంధనాన్ని సురక్షితంగా ఉపయోగించవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. అయితే 2025 ఏప్రిల్‌ 1 తర్వాత తయారైన కొత్త మోడళ్లు ఈ20కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపింది. సోషల్‌ మీడియాలో ఓ కస్టమర్‌ అడిగిన ప్రశ్నకు మహీంద్రా స్పందించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పెట్రోల్‌ ప్రమాణాలకు అనుగుణంగా తమ ఇంజిన్లు రూపొందించామని పేర్కొంది. అన్ని మహీంద్రా పెట్రోల్‌ వాహనాలు ఈ20 ఇంధనంతో సురక్షితంగా నడుస్తాయని వెల్లడించింది.

2025 ఏప్రిల్‌ 1 తర్వాత తయారైన వాహనాల్లో ఇంజిన్‌ను ప్రత్యేకంగా క్యాలిబ్రేట్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఈ20 పెట్రోల్‌తో మెరుగైన యాక్సిలరేషన్‌, ఇంధన సామర్థ్యం లభిస్తుందని పేర్కొంది. అంతకుముందు తయారైన వాహనాలు కూడా ఈ20తో ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయని స్పష్టం చేసింది. అయితే డ్రైవింగ్‌ విధానం, రహదారి పరిస్థితులను బట్టి మైలేజ్‌ లేదా యాక్సిలరేషన్‌లో స్వల్ప మార్పులు కనిపించవచ్చని వివరించింది.

ఇటీవల ఈ20 పెట్రోల్‌పై సోషల్‌ మీడియాలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల ఆందోళనలను తగ్గించేందుకే మహీంద్రా ఈ వివరణ ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో టయోటా, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్‌, హ్యుందాయ్‌ ప్రతినిధులు కూడా ఈ20 ఇంధనం వాహనాలకు పూర్తిగా సురక్షితమేనని చెప్పారు. మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉండొచ్చని, కానీ ఇంజిన్‌కు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు.
Mahindra
E20 Petrol
Mahindra Petrol Cars
Ethanol Blended Petrol
Car Engine Safety
Mahindra E20 Update

More Telugu News