ముంబై, ఢిల్లీలో ఇల్లు కొనడం కష్టమే... అందుబాటులో ఉన్న నగరాలివే!
- 2026 ప్రథమార్ధంలో సొంతింటి కలకు ఊరట
- దేశంలోనే అత్యంత అందుబాటు ధరల్లో ఇళ్లు అహ్మదాబాద్లో లభ్యం
- ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్లలో కొనసాగుతున్న అధిక ధరల భారం
- ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో ఈఎంఐల భారం తగ్గుముఖం
- ఆస్తుల ధరలు పెరగడంతో కొనుగోలు శక్తి వృద్ధిలో స్వల్ప మందగమనం
నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. ఒక కుటుంబం తమ నెలవారీ ఆదాయంలో ఈఎంఐల కోసం ఎంత శాతం ఖర్చు చేస్తుందనే దాని ఆధారంగా కొనుగోలు శక్తిని (అఫర్డబిలిటీ) లెక్కిస్తారు. ఈ నిష్పత్తి 50 శాతం లోపు ఉంటే దానిని అందుబాటు ధరగా పరిగణిస్తారు. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆరు నగరాలు ఈ 50 శాతం పరిమితి లోపే ఉన్నాయి. అహ్మదాబాద్లో ఈ నిష్పత్తి కేవలం 23 శాతంగా నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో కోల్కతా (25శాతం), పుణె (28శాతం) నిలిచాయి.
అయితే, దేశ ఆర్థిక రాజధాని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లలో మాత్రం ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయి. ఈ రెండు నగరాలు 50 శాతం పరిమితిని దాటి కొనుగోలుదారులకు భారంగా మారాయి. ముఖ్యంగా ఎన్సీఆర్లో ఇది 65 శాతంగా ఉంది.
గత ఏడాదితో పోలిస్తే బెంగళూరు (35 శాతం), ఎన్సీఆర్ (65 శాతం) నగరాల్లో కొనుగోలు శక్తి స్వల్పంగా క్షీణించింది. మిగిలిన మార్కెట్లలో మాత్రం ధరలు స్థిరంగా కొనసాగాయి. కరోనా మహమ్మారి సమయంలో ఆర్బీఐ రెపో రేటును దశాబ్దపు కనిష్ఠ స్థాయికి తగ్గించడంతో కొనుగోలు శక్తి గణనీయంగా మెరుగుపడింది. అయితే, అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి ఆర్బీఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచడంతో 2022లో కొనుగోలు శక్తి మళ్లీ దెబ్బతింది. 2023 నుంచి వడ్డీ రేట్లలో స్థిరత్వం, ఇటీవల చేపట్టిన 125 బేసిస్ పాయింట్ల కోతతో గృహ రుణాలపై భారం తగ్గి, అమ్మకాలు మళ్లీ పుంజుకున్నాయి.
ఈ నివేదికపై నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ.. "ఇటీవలి కాలంలో ఆస్తుల ధరలు పెరగడం వల్ల కొనుగోలు శక్తిలో వృద్ధి కొంత మందగించింది. అయినప్పటికీ, స్థిరమైన ఆదాయాలు, ఆరోగ్యకరమైన ఉపాధి అవకాశాలు, అనుకూలమైన రుణ సదుపాయాలు గృహాలకు డిమాండ్ను నిలబెడుతున్నాయి. భవిష్యత్తులో మార్కెట్ వృద్ధి కొనసాగాలంటే ఆదాయ వృద్ధి స్థిరంగా ఉండటం, మార్కెట్లో సమతుల్యత కొనసాగడం చాలా కీలకం" అని వివరించారు.