తమిళనాడులో పొలిటికల్ హీట్: విజయ్ ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర?.. మాజీ మంత్రిపై లుకౌట్ నోటీస్!
- టీవీకే ప్రభుత్వాన్ని పడదోసేందుకు కుట్ర
- మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై లుకౌట్ నోటీస్
- ఎమ్మెల్యేకు రూ. 35 కోట్ల ఆఫర్
- కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్ట్
- రూ. 180 కోట్ల మేర చేతులు మారినట్లు ఆరోపణలు
ఈ కేసులో జూన్ 29న ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా ఫిర్యాదు చేశారు. ఒక ఒపీనియన్ పోలింగ్ సంస్థ అధినేతనని చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఒక ‘ప్రధాన రాజకీయ పార్టీ’ తరఫున తనకు కోట్ల రూపాయల లంచం ఆఫర్ చేశాడని, దాన్ని తిరస్కరించడంతో తన కుటుంబానికి ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ట్రిప్లికేన్ పోలీసులు ప్రధాన నిందితుడు తిరునావుక్కరసుతో పాటు ఆయన అనుచరులు నరేష్, త్యాగరాజన్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరి విచారణలో ఈ కుట్ర అంతా సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ల ప్రత్యక్ష ఆదేశాల మేరకే జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. జులై 6న (సోమవారం) విచారణకు హాజరుకావాలని కరూర్ జిల్లా రామేశ్వరపట్టిలోని సెంథిల్ బాలాజీ పూర్వీకుల నివాసంలో సమన్లు కూడా జారీ చేశారు.
శాసనసభ్యులను ప్రలోభపెట్టేందుకు ఏకంగా రూ. 180 కోట్లు కేటాయించారని దర్యాప్తులో తేలడంతో.. పరారీలో ఉన్న నిందితుల కోసం కరూర్, తిరుచిరాపల్లి, కోయంబత్తూర్, బెంగళూరులలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు, ఎలాంటి స్వతంత్ర ఆధారాలు లేకుండా కేవలం కాల్ డేటా ఆధారంగానే తనను ఇరికిస్తున్నారంటూ అశోక్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక డీఎంకే నాయకత్వమే ఉందంటూ టీవీకే మంత్రులు ఆరోపిస్తుండగా.. డీఎంకే మాత్రం ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని, ఆధారాలు లేని కేసు అని కొట్టిపారేసింది. దీనికి ప్రతిగా, ఇద్దరు ఎండిఎంకె ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేందుకు సీఎం విజయ్ తన పదవిని దుర్వినియోగం చేశారంటూ డీఎంకే సీనియర్ నేత ఆర్ ఎస్ భారతి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, అవినీతి నిరోధక శాఖకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం ఈ కేసు అరెస్టులు, పరస్పర ఆరోపణలతో తమిళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.