‘ఒక్క దెబ్బతో ఇరాన్ లీడర్షిప్ను ఖతం చేయొచ్చు’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- చర్చలు జరిపేందుకు ఎవరూ మిగలరనే ఉద్దేశంతోనే ఆగామన్న ట్రంప్
- ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ
- ఇరాన్ ప్రజల కన్నీళ్లు 'నకిలీవి' కావచ్చంటూ ట్రంప్ వ్యాఖ్య
- యాక్సియోస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాల వెల్లడి
శనివారం 'యాక్సియోస్' మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ అంత్యక్రియల దృష్ట్యా శాంతి చర్చలకు వారం రోజుల పాటు విరామం ఇచ్చామని, ఈ సమయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకూడదని ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఒక ఒప్పందం కోసం ఇరాన్ నేతలు ప్రాధేయపడుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో, ఖమేనీ అంత్యక్రియల ప్రసారాలను తాను టీవీలో చూశానని, ప్రజలు ఏడవడం చూసి ఆశ్చర్యపోయానని ట్రంప్ చెప్పారు. ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని తాను భావించానని, వారి కన్నీళ్లు బహుశా 'నకిలీవి' అయి ఉండొచ్చని ఎద్దేవా చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. "మీకు నాగరికత, చరిత్ర, గౌరవం ఏవీ లేవు.. అందుకే ఈ విషయాలు మీకు అర్థం కావు" అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది.
మరోవైపు ఇరాన్ సైనిక కమాండర్ అలీ అబ్దుల్లాహి శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇరాన్పై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా తమ సాయుధ దళాల నుంచి తీవ్రమైన ప్రతీకారం తప్పదని అమెరికా, ఇజ్రాయెల్లను హెచ్చరించారు. ఈ నెల 3న మొదలైన ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపుల కార్యక్రమం 9న ఆయన స్వస్థలమైన మషద్లో ముగుస్తుంది.
మరోవైపు, ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీని కూడా హతమారుస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా స్పందించారు. తమ ప్రజలకు గానీ, నాయకత్వానికి గానీ ఎలాంటి ముప్పు వచ్చినా తక్షణమే శక్తిమంతమైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. కాగా, భద్రతా కారణాల దృష్ట్యా ముజ్తబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియల్లో బహిరంగంగా పాల్గొనే అవకాశం లేదని భారతదేశంలోని సుప్రీం లీడర్ ప్రతినిధి అయతొల్లా హకీమ్ ఎలాహి పేర్కొన్నారు.