జగన్కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదు: అనిత
- జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో అనిత విమర్శలు
- స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాలకు వాడుకోవాలని జగన్ భావించారని విమర్శ
- కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశంపై గత ఐదేళ్లలో జగన్ వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ఘాటైన ఆరోపణలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డికి “విశాఖ స్టీల్ ప్లాంట్” అనే పదం పలికే అర్హత కూడా లేదని హోంమంత్రి స్పష్టం చేశారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాల కోసం వినియోగించుకోవాలని జగన్ భావించారని, ఈ విషయాన్ని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారే స్వయంగా వెల్లడించారని అనిత పేర్కొన్నారు. "స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు సంవత్సరాల తరబడి ఆందోళనలు చేస్తుంటే.. జగన్ కనీసం ఒక్కరోజు కూడా ధర్నా ప్రాంగణానికి వెళ్లి వారికి మద్దతు తెలపలేదు. అప్పట్లో కార్మికులను విమానాశ్రయానికి పిలిపించుకుని మాట్లాడిన జగన్.. ఇప్పుడు కూడా కార్మిక సంఘాల నాయకులను తన వద్దకే పిలిపించుకుని రాజకీయం చేస్తున్నారు" అని హోంమంత్రి మండిపడ్డారు.
ఒకప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో 99 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే స్థితికి చేరుకుందని వంగలపూడి అనిత వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందంటూ ఆమె పలు కీలక అంశాలను ప్రస్తావించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదాల్లో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి తొలిసారిగా 'శాశ్వత ఉద్యోగం' కల్పించే చారిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డి. కుమారస్వామి తీసుకున్నారని తెలిపారు.
మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రస్తుతం రూ.60 లక్షల నుండి రూ.1 కోటి వరకు బీమా ప్రయోజనాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా కేంద్ర ఉక్కు మంత్రిని విశాఖకు తీసుకురాలేకపోయారని, కానీ ప్రస్తుత కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా ప్లాంట్లో తెల్లవారుజాము వరకు ఉండి పరిస్థితులను సమీక్షించారని అనిత గుర్తుచేశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై స్పందిస్తూ.. ఆ సంస్థ రూ.150 కోట్ల బీమా చెల్లించాల్సి ఉండగా, జగన్ ప్రభుత్వం కేవలం రూ.12 కోట్లు మాత్రమే కట్టించుకుని చేతులు దులుపుకుందని హోంమంత్రి ఆరోపించారు. అంతేకాకుండా, గంగవరం పోర్టులో ఏపీ ప్రభుత్వానికి రావాల్సిన 10.24 శాతం వాటాను కూడా గత వైసీపీ ప్రభుత్వమే వదులుకుందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది తమ కూటమి ప్రభుత్వమేనని, ప్లాంట్ పరిరక్షణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.