అట్టుడుకుతున్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌.. పాకిస్థాన్‌ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు!

Pakistan occupied Kashmir on fire People revolt against Pakistan government
  • పీఓకే రావాలాకోట్‌లో హింసాత్మక ఘర్షణలు
  • జేఏఏసీ సంస్థపై పాక్ ప్రభుత్వం నిషేధం
  • అల్లర్లలో 11 మంది మృతి, 70 మందికి గాయాలు
  • 12 అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై వివాదం
  • ఇంటర్నెట్ బంద్, నిలిచిపోయిన మొబైల్ సేవలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో మరోసారి హింసాత్మక జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అక్కడి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ)పై పాకిస్థాన్‌ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధం విధించడంతో పీఓకే అంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నేడు నిర్వహించ తలపెట్టిన ప్రాంతీయ బంద్‌కు ముందు రావాలాకోట్ నగరంలో నిరసనకారులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య వందల్లో ఉందని సోషల్‌ మీడియాలో స్థానికులు పోస్ట్‌ చేస్తున్నారు.

ఇటీవల జరిగిన కాల్పుల్లో మరణించిన తమ తోటి కార్యకర్త మృతదేహాన్ని ఉంచిన ఆసుపత్రి మార్చురీ వెలుపల జేఏఏసీ మద్దతుదారులు భారీగా గుమిగూడారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు, పారామిలిటరీ దళాలు బలప్రయోగం చేయడంతో ఈ హింస చెలరేగింది. పూంచ్ సెక్టార్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసు అధికారులు, దారివెంట వెళ్లే ఓ వ్యక్తి చనిపోయారని తెలిపారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నిరసనకారులు మరణించారని తెలిపారు. మొత్తం 23 మంది భద్రతా సిబ్బంది, 50 మంది నిరసనకారులు గాయపడినట్లు పోలీస్ చీఫ్ లియాఖత్ మాలిక్ ధ్రువీకరించారు. అయితే, మృతుల సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఈ నిరసనలు ఎందుకు?
ఈ తాజా వివాదానికి ప్రధాన కారణం.. పీఓకే అసెంబ్లీలోని 45 స్థానాల్లో 12 సీట్లను కశ్మీర్ వెలుపల పాక్‌లోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న శరణార్థుల కోసం కేటాయించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించడమే. ఈ నిర్ణయం వల్ల స్థానిక ప్రజల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని జేఏఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనితో పాటు గత రెండేళ్లుగా పీఓకేలో విపరీతంగా పెరిగిన పిండి, విద్యుత్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పాక్ పాలకుల రాజకీయ వివక్షపై ప్రజలు నిరంతరాయంగా పోరాడుతున్నారు. జులై 27న అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, జేఏఏసీ కేంద్ర కార్యాలయాన్ని సీల్ చేసింది.

ఈ హింసపై ‘హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న పౌర సంస్థపై ఉగ్రవాద చట్టాల కింద నిషేధం విధించడాన్ని తప్పుబట్టింది. తక్షణమే ఇరు పక్షాలు చర్చలు జరపాలని కోరింది. మరోవైపు జేఏఏసీ నాయకుడు శౌకత్ నవాజ్ మీర్ ‘ఎక్స్’లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ.. రావాలాకోట్‌లో పాక్ ప్రభుత్వం తమ ప్రజలను ఊచకోత కోస్తోందని, నిషేధాలు విధించినా తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. పీఓకేలో రోజురోజుకూ క్షీణిస్తున్న ఈ భద్రతా పరిస్థితుల దృష్ట్యా బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు తమ పౌరులకు అత్యవసర ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి.
Go Back to Shorts
PoK
Pakistan occupied Kashmir
Joint Awami Action Committee
Rawalakot Protests
Pakistan Government
Human Rights Pakistan

More Telugu News