అమెరికాలో మరో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ దుర్మరణం
- న్యూజెర్సీ రోడ్డు ప్రమాదంలో దీపారెడ్డి అనే మహిళ మృతి
- కారు సిగ్నల్ వద్ద వేచి ఉన్న సమయంలో వెనకనుంచి ఢీకొన్న మరో కారు
- దీపారెడ్డిది రంగారెడ్డి జిల్లా ఆకుతోటపల్లి గ్రామం
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీపతి దీపారెడ్డి (44) దుర్మరణం చెందారు. ఆమె రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందినవారు. దీపారెడ్డి తన భర్త రామకృష్ణారెడ్డితో కలిసి న్యూజెర్సీలో నివాసముంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు సిగ్నల్ వద్ద వేచి ఉన్న సమయంలో, వేగంగా వచ్చిన మరొక వాహనం వీరి కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీపారెడ్డి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
సంతోషంగా జీవిస్తున్న కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలముకోవడంతో స్వగ్రామం ఆకుతోటపల్లిలోనూ, బంధువుల్లోనూ విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై న్యూజెర్సీ స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీపారెడ్డి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.