పాక్లోనే ఆడాం.. భారత్లో ఏం భయం?: బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్
- టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొన్న బంగ్లాదేశ్
- తాజాగా పెదవి విప్పిన కెప్టెన్ లిటన్ దాస్
- తాము భారత్లో ఆడాలనుకున్నామని వెల్లడి
- ఆడొద్దన్నది బోర్డు నిర్ణయమేనని స్పష్టీకరణ
- పాక్లో గన్స్ పట్టుకొని రూమ్ బయట ఉండేవారని వెల్లడి
- అక్కడే ఆడినప్పుడు భారత్లో ఆడలేమా? అని ప్రశ్న
భారత్కు వెళ్లకూడదనే నిర్ణయం బోర్డు పెద్దలదే తప్ప, ఆటగాళ్లది కాదని లిటన్ దాస్ కుండబద్దలు కొట్టారు. ఆటగాళ్లుగా తాము భారత్లో ఆడటానికే మొగ్గు చూపామని చెబుతూ.. పాకిస్థాన్ భద్రతా పరిస్థితులతో భారత్ను పోల్చారు.
‘‘మేం బోర్డు అధికారులతో సమావేశం కోసం వెళ్లాం. ఏసీ రూమ్లో కూర్చుని చాయ్ తాగుతూ మా అభిప్రాయం చెప్పాలనుకున్నాం. అక్కడ మమ్మల్ని ఏం కావాలని అడిగారు. ఆటగాళ్లుగా మాకు క్రికెట్ ఆడటం తప్ప వేరే ఏం కావాలి? ఎవరితోనూ గొడవలు పడటం మాకు ఇష్టం ఉండదు. అయితే భారత్లో భద్రత లేదని బోర్డు వారు మాతో చెప్పారు. దానికి మేము.. మేం పాకిస్థాన్లోనూ క్రికెట్ ఆడాం కదా అని గుర్తుచేశాం. పాక్లో అయితే ఏకంగా మా రూమ్ బయట గన్లు పట్టుకుని నిల్చునేవారు. అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితి ఇంకేముంటుంది? అక్కడ ఆడినప్పుడు భారత్లో ఎందుకు ఆడలేం అని ప్రశ్నించాం’’ అని లిటన్ దాస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అంతకుముందు జనవరి నెలలో ఈ వివాదం మొదలైనప్పుడు మాత్రం లిటన్ దాస్ చాలా ఆచితూచి మాట్లాడారు. అప్పట్లో వరల్డ్ కప్ ఆడటంపై తనతో పాటు దేశమంతా అయోమయంలో ఉందని, దీనిపై సమాధానం చెప్పడం తనకు సేఫ్ కాదంటూ దాటవేశారు. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ ముగిసిన నాలుగు నెలల తర్వాత బోర్డు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఆయన బహిరంగంగా తప్పుబడుతున్నారు.