Advertisement

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డ్యాన్స్ మాస్టర్ పండు

Dancer master Pandu accident
  • విశాఖ జిల్లా ఆనందపురం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
  • పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు
  • కాళ్లకు ఆపరేషన్ నిర్వహించాలన్న వైద్యులు

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు (జి.షణ్ముఖ) రోడ్డు ప్రమాదానికి గురైన వార్త బుల్లితెర వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం వద్ద నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిపై విశాఖలోని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు మీడియాకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.


ఈ ప్రమాదంలో పండు రెండు కాళ్లకు చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నామని, అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం అతడి కాళ్లకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం పండు కనీసం ఆరు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుంటేనే మళ్లీ కోలుకుని, సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. 


మరోవైపు, ఈ ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై ఆనందపురం పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పండు త్వరగా కోలుకోవాలని అతడి అభిమానులు, బుల్లితెర ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement
Dance Master Pandu
tollywood

More Telugu News