ఆరోగ్యమే అసలైన సంపద.. జీవనశైలి మార్చుకోవాలి: సీఎం చంద్రబాబు
- గుంటూరులో లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- అమరావతిని గ్లోబల్ హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటన
- సంజీవని ప్రాజెక్టు, యూనివర్సల్ హెల్త్ పాలసీ వివరాలు వెల్లడి
- గత ప్రభుత్వంలో నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని విమర్శ
- ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రజలకు సూచన
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గుంటూరులో 600 పడకలతో, 32 విభాగాలతో అత్యాధునిక వసతులతో లలితా ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా, దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఆధునిక ఎమ్ఆర్ఐ స్కాన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. "ఒక బ్రాండ్కు విలువలు, ప్రజల్లో విశ్వసనీయత తోడైతే దానికి తిరుగుండదు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ అందుకు నిదర్శనం" అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని సమూలంగా మారుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. "ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు 'సంజీవని' ప్రాజెక్టును తీసుకొచ్చాం. దీని ద్వారా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులు నిర్వహిస్తాం. వ్యాధి రాకముందే గుర్తించడం (ప్రిడిక్టివ్), రాకుండా నివారించడం (ప్రివెంటివ్), వచ్చాక నయం చేయడం (క్యూరేటివ్) అనే త్రిముఖ వ్యూహంతో పనిచేస్తాం. ఇంటి వద్దకే వచ్చి 42 రకాల వైద్య పరీక్షలు చేస్తాం" అని వివరించారు. రాష్ట్రంలో 'యూనివర్సల్ హెల్త్ పాలసీ'ని అమలు చేసి, ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆరోగ్యమే అసలైన సంపద అని, ఆరోగ్యకరమైన పౌరులే సంపన్న దేశాన్ని నిర్మిస్తారని చంద్రబాబు అన్నారు. మంచి ఆహారం, వ్యాయామం, యోగా, ప్రాణాయామం వంటివి జీవనశైలిలో భాగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. "మన వంటిల్లే మన ఫార్మసీ. మనం తినే ఆహారమే మనకు రక్ష. కానీ ఈ రోజుల్లో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం పెరిగిపోయింది," అని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని ఆసుపత్రులు కట్టినా, ప్రజల జీవనశైలిలో మార్పు రానంత వరకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం కాదని హితవు పలికారు.