నన్ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, బీజేపీల కుట్ర: కొడంగల్లో రేవంత్ రెడ్డి
- కొడంగల్ లో ఎస్ఐఆర్ ఫారమ్ స్వయంగా నింపిన రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్కు ఓటేసిన వారి ఓట్లను తొలగించే ప్రక్రియలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయని విమర్శ
- కుట్రదారులకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు
బీఆర్ఎస్, బీజేపీల తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఆ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను పరిశీలించిన ఆయన, తన ఫారమ్ను స్వయంగా నింపి అధికారులకు అందజేశారు. బూత్ లెవల్ ఏజెంట్లతో (BLA) మాట్లాడారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు పైకి వేరువేరుగా కనిపించినా, ఆ పార్టీల లక్ష్యం మాత్రం ఒకటేనని ఆరోపించారు. కాంగ్రెస్కు ఓటేసిన వారి ఓట్లను తొలగిస్తూ కొడంగల్లో కుట్రలకు తెరలేపారని, ఆ కుట్రదారులకు స్థానిక ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
'ఓటు లేని మనిషి సజీవంగా ఉన్నా చనిపోయినవారితో సమానం' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే అవకాశం కోల్పోతారని హెచ్చరించారు. కొడంగల్లో ఇప్పటికే 78 శాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని, ప్రతి ఒక్కరూ ఈ ఫారమ్ నింపి తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని సూచించారు. అనంతరం, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులతో కలిసి కొడంగల్ వీధుల్లో నిర్వహించిన ధర్నా ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.