సెల్ఫీల మోజులో ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు: అమెరికా నుంచి సీతక్క విన్నపం
- ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీతక్క
- ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు మంత్రి సూచనలు
- జలపాతాల వద్ద బ్యారికేడ్లను దాటవద్దని హెచ్చరిక
తెలంగాణలోని ములుగు జిల్లా ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలుకుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆమె, అక్కడి నుంచే పర్యాటకుల భద్రతను ఉద్దేశించి ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దట్టమైన అడవులు, గోదావరి జలాలు, బొగత జలపాతం, రామప్ప దేవాలయం, మేడారం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి అందాలకు ములుగు కేరాఫ్ అడ్రస్ అని ఆమె పేర్కొన్నారు. పర్యాటకులు ఇక్కడికి వచ్చి సంతోషకరమైన జ్ఞాపకాలతో సురక్షితంగా తిరిగి వెళ్లాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
అయితే, ఇటీవల కొందరు యువకులు ఉత్సాహంతో నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోవడం పట్ల మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ, పోలీసు శాఖలు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని ఆమె హెచ్చరించారు. ప్రమాదకరమైన జలపాతాలు, వేగంగా ప్రవహించే వాగులు, కొండచరియల వద్ద కేవలం సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. పర్యాటకులు అధికారుల సూచనలను పాటిస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే పర్యటన సురక్షితంగా, ఆనందంగా ఉంటుందని సీతక్క గుర్తుచేశారు.