Advertisement

మంగళగిరి ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు.. భారీగా అభివృద్ధి చేస్తా: మంత్రి లోకేశ్‌

Nara Lokesh promises massive development for Mangalagiri after receiving huge majority
  • మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పేదలకు శాశ్వత పట్టాల పంపిణీ
  • ప్రజలిచ్చిన భారీ మెజారిటీతోనే అభివృద్ధి పనులు వేగవంతం చేశానన్న లోకేశ్‌
  • మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయ‌న్న మంత్రి
  • రూ.1800 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం
  • కేంద్ర నిధులతో ఎంపీ పెమ్మసాని సహకారంతో అభివృద్ధి పనులు
మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని, రాష్ట్రమంతా ఈ నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. 'మన ఇల్లు-మన లోకేశ్‌' కార్యక్రమంలో భాగంగా రెండోరోజైన బుధవారం మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3 వేల మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

భారీ మెజారిటీతోనే భారీ అభివృద్ధి
ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు 91 వేల ఓట్ల భారీ మెజారిటీ కట్టబెట్టారని, ఆ విజయమే తనకు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసేందుకు కొండంత బలాన్ని ఇస్తోందని లోకేశ్‌ అన్నారు. "మీరిచ్చిన ఈ అఖండ విజయం వల్లే నేను కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి నిధులు తీసుకురాగలుగుతున్నా. మంగళగిరి ప్రజలే నా కుటుంబం. ఇక్కడ నాకు సొంత అక్కాచెల్లెళ్లు లేకపోయినా, మీ అందరినీ చూస్తుంటే నా సొంతవారిని చూసినట్లే ఉంటుంది" అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు.

ఓటమి నేర్పిన పాఠం.. ప్రజల మనసు గెలిచా
2019 ఎన్నికల నాటి అనుభవాలను లోకేశ్‌ గుర్తుచేసుకున్నారు. "అప్పుడు ఇంటి పట్టాల రెగ్యులరైజేషన్‌పై హామీ ఇవ్వమని అడిగారు. కానీ, పూర్తి అవగాహన లేకుండా హామీ ఇవ్వడం సరికాదని చెప్పడంతో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఆ ఓటమి నాలో కసి పెంచింది. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు అహర్నిశలు శ్రమించి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నా" అని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో ఎన్టీఆర్ సంజీవని క్లినిక్‌లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, పేదల ఇళ్లలో శుభకార్యాలకు సాయం, అంత్యక్రియలకు ఆర్థిక సాయం వంటి 29 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని వివరించారు.

మోడల్ నియోజకవర్గమే లక్ష్యం
మంగళగిరిని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు లోకేశ్‌ తెలిపారు. నియోజకవర్గంలోని భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రూ.1800 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కేంద్రం నుంచి ఛాలెంజ్ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధులతో ఈ పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దీంతో పాటు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, పార్కులు, కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధి, మూసేసిన అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, పైప్‌లైన్ గ్యాస్ వంటి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిడమర్రు స్కూలులో సీటు కోసం ఒక తల్లి తనతో వాదించడం ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన నాణ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల ప్రయాణం
కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తోందని లోకేశ్‌ అన్నారు. 'తల్లికి వందనం' పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నేటి నుంచి నిధులు జమ చేస్తున్నామని, 4 వేల రూపాయల పింఛను, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలను దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి పనిచేయడం వల్లే కేంద్రం నుంచి నిధులు సులభంగా వస్తున్నాయని, నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను 12 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు నందం అబద్ధయ్య, పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
Mangalagiri development
House site pattas
Andhra Pradesh IT Minister
Pemmasani Chandrasekhar
Mana Illu Mana Lokesh

More Telugu News