దేశాన్ని అస్థిరపరిచే కుట్ర: ఢిల్లీ అల్లర్లపై సినీ నటుడు నరేశ్
- ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై నరేశ్ ఆందోళన
- వాహనాల ధ్వంసం, పోలీసులు గాయపడటంపై దిగ్భ్రాంతి
- యువతను తప్పుదోవ పట్టించడాన్ని క్షమించకూడదని వ్యాఖ్య
ఢిల్లీలో జరిగిన 'ఛలో పార్లమెంట్' నిరసన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై ప్రముఖ నటుడు నరేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిరసనకారులు బారికేడ్లను దాటుకుని పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం వరకు వెళ్లిన పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల పేరుతో వాహనాలు ధ్వంసం చేయడం, పోలీసులు, ఆందోళనకారులు గాయపడటం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నీట్ పేపర్ లీక్ అనేది చాలా తీవ్రమైన అంశమని, ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి ఉండాల్సిందని నరేశ్ అభిప్రాయపడ్డారు. అయితే పరీక్షలు పూర్తై ఫలితాలు కూడా వచ్చాక ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఘర్షణల్లో పోలీసు సిబ్బంది కూడా గాయపడటాన్ని చూస్తుంటే... దీని వెనుక దేశాన్ని అస్థిరపరిచే సంఘవిద్రోహ శక్తుల కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయని... ఈ అంశంపై సమగ్రంగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే హింసకు పాల్పడటం లేదా యువతను తప్పుదోవ పట్టించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం నరేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.