భారత క్రికెట్‌లో కొత్త రూల్స్.. ఇక‌పై కావాల‌ని నో బాల్ వేస్తే మ్యాచ్‌కే దూరం!

BCCI New Rules In Indian Cricket Match Suspension For Intentional No Balls
  • దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ పలు కీలక మార్పులు
  • ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచి సస్పెన్షన్
  • రెడ్ బాల్ గేమ్‌లో చివరి ఇన్నింగ్స్‌ను ఫర్‌ఫీట్ చేయడంపై నిషేధం
  • డ్రింక్స్ బ్రేక్‌లో కోచ్‌లు పిచ్‌పైకి వచ్చేందుకు అనుమతి
  • వచ్చే నెలలో దులీప్ ట్రోఫీ నుంచి కొత్త నిబంధనల అమలు
భారత దేశవాళీ క్రికెట్ స్వరూపాన్ని మార్చే దిశగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026-27 దేశవాళీ సీజన్ కోసం ఆట నిబంధనలలో గణనీయమైన మార్పులు చేసింది. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలకు అడ్డుకట్ట వేయడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలను ఆధునికీక‌రించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపట్టింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

లార్డ్స్‌లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సూచించిన మార్పులకు ఆమోదం తెలుపుతూ బీసీసీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ మార్పుల గురించి ఇప్పటికే రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారం అందించింది.

ప్రధాన మార్పులు ఇవే..
ఉద్దేశపూర్వక నో బాల్‌పై కఠిన చర్యలు: కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్ ఫుట్ నో బాల్ లేదా బంతి పిచ్‌పై ల్యాండ్ అవ్వకుండా వేస్తే, దానిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు దానిని ఉద్దేశపూర్వక తప్పిదంగా నిర్ధారిస్తే, సదరు బౌలర్‌ను ఆ ఒక్క ఇన్నింగ్స్ నుంచి కాకుండా మొత్తం మ్యాచ్ నుంచే సస్పెండ్ చేస్తారు. గతంలో కేవలం ఆ ఇన్నింగ్స్‌కు మాత్రమే బౌలింగ్ చేయకుండా నిషేధించేవారు. ఈ నిర్ణయంతో ఆటలో నిజాయతీని కాపాడాలని బీసీసీఐ భావిస్తోంది.

చివరి ఇన్నింగ్స్ ఫర్‌ఫీట్‌పై నిషేధం: మ్యాచ్ ఫలితాలను కృత్రిమంగా నిర్దేశించే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెడ్ బాల్ మ్యాచ్‌లలో ఏ జట్టూ తమ చివరి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం గానీ, ఫర్‌ఫీట్ (వదులుకోవడం) గానీ చేయకూడదు. ఈ నిబంధన దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ మార్పు చేశారు.

ఆఖరి ఓవర్ పూర్తి చేయాల్సిందే: రోజు ఆట ముగిసే సమయంలో చివరి ఓవర్‌లో వికెట్ పడితే, గతంలో అప్పటికప్పుడు స్టంప్స్ ప్రకటించేవారు. కొత్త బ్యాటర్ రావడానికి సమయం పడుతుందనే కారణంతో ఈ విధానం ఉండేది. అయితే, కొత్త నిబంధన ప్రకారం వికెట్ పడినా సరే, ఆ ఓవర్‌ను పూర్తిగా పూర్తి చేయాల్సిందే.

ఇతర ముఖ్యమైన మార్పులు:
అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా దేశవాళీ వన్డే క్రికెట్‌లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్‌లు పిచ్‌పైకి వచ్చి ఆటగాళ్లతో చర్చించేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే, వికెట్ కీపర్ల గ్లోవ్స్‌కు సంబంధించిన నిబంధనను కూడా సవరించారు. గతంలో బౌలర్ రనప్ ప్రారంభించినప్పటి నుంచి కీపర్ గ్లోవ్స్ వికెట్ల వెనుక ఉండాల్సి ఉండగా, ఇప్పుడు బంతిని డెలివరీ చేసే సమయంలో వికెట్ల వెనుక ఉంటే సరిపోతుంది.

ఈ కొత్త నిబంధనలపై అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు రాష్ట్ర సంఘాల ద్వారా ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ మార్పులను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు వర్తింపజేస్తారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఐపీఎల్‌కు ప్రత్యేక ప్లేయింగ్ కండిషన్స్ ఉండటంతో ఈ అంశంపై ఆసక్తి నెలకొంది.
Advertisement
BCCI
Indian Domestic Cricket Rules
Duleep Trophy 2024
Intentional No Ball Penalty
MCC Cricket Rules
BCCI Playing Conditions

More Telugu News