సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ
- రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన
- సింగపూర్ హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల భేటీ
- పోలీసు వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకున్న మంత్రులు
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు అత్యంత కీలకమైన భేటీలతో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్లు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
సింగపూర్లో నేరాల శాతం తక్కువగా ఉండటానికి కారణమైన కఠిన చట్టాలు, పోలీసు వ్యవస్థ పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసం సింగపూర్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థపై హోం మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక ఆసక్తిని కనపరిచారు. ఏపీలో కూడా ఇటువంటి అధునాతన వ్యవస్థలను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించారు.
మరోవైపు, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో మంత్రులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పట్టణాల రూపకల్పన, భూమి వినియోగంలో పారదర్శకత, ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతంతో పాలనలో బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలనే అంశాలపై నిపుణులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నిన్న ప్రారంభమైన మంత్రుల సింగపూర్ పర్యటన... ఏడు రోజుల పాటు కొనసాగనుంది.