అమెరికాను నమ్మలేం.. రెండో విడత చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ఇరాన్

Iran says yet to be taken decision on second phase talks with US
  • అమెరికా వైరుధ్యపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శ
  • ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేయడమే ఇందుకు నిదర్శనమన్న ఇరాన్
  • అమెరికాపై నమ్మకం లోపించిందని, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత అని స్పష్టం
అమెరికాతో జరగాల్సిన తదుపరి దశ చర్చల్లో పాల్గొనడంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ సోమవారం స్పష్టం చేసింది. వాషింగ్టన్ నుంచి వైరుధ్యపూరిత చర్యలు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ వైఖరి తీసుకున్నట్లు తెలిపింది.

టెహ్రాన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయి ఈ విషయాలు వెల్లడించారు. "తదుపరి చర్చల గురించి మేము ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు" అని ఆయన స్పష్టంగా చెప్పారు. దౌత్య మార్గాన్ని అనుసరిస్తున్నామని చెబుతూనే అమెరికా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం నుంచే అమెరికా నుంచి తమకు వ్యతిరేకత, ఫిర్యాదులు ఎదురయ్యాయని బాఘేయి పేర్కొన్నారు. తాజాగా ఆదివారం రాత్రి హర్మూజ్ జలసంధిలో ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసిందని, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, దురాక్రమణ చర్య అని ఆరోపించారు. అయితే, అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఇరాన్ కార్గో షిప్‌ను అడ్డగించి, స్వాధీనం చేసుకున్నామని ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అమెరికా చర్యల్లోని ఈ అస్థిరత, చర్చల ప్రక్రియపై తమకున్న అపనమ్మకాన్ని మరింత పెంచుతోందని బాఘేయి అన్నారు. గతంలో అమెరికా రెండుసార్లు దౌత్యానికి ద్రోహం చేసిందని, తమ సార్వభౌమత్వంపై దాడి చేసిందని గుర్తుచేశారు. ఈ అనుభవాలను విస్మరించలేమని, జాతీయ ప్రయోజనాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే భవిష్యత్ మార్గంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, రేపు (ఏప్రిల్ 21) పాకిస్థాన్ రాజజధాని ఇస్లామాబాద్ లో చర్చలు ఉంటాయని ట్రంప్ చెబుతున్న నేపథ్యంలో, ఇరాన్ తాజా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
Go Back to Shorts
Iran
Talks
USA
Islamabad
Pakistan

More Telugu News