కెమెరా యాంగిల్ కాదు, హృదయం యాంగిల్ మార్చండి: ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ చురక

Priyanka Gandhi slams PM Modi says change heart angle not camera angle
  • విద్యార్థులపై లాఠీఛార్జ్ ఎందుకు చేశారని ప్రభుత్వానికి ప్రశ్న
  • పదేళ్లలో 152 పేపర్ లీక్‌లు జరిగినా ఒక్క మాఫియాను శిక్షించలేదని విమర్శ
  • కొత్త చట్టాలు కాదు, నిజాయితీతోనే యువత నమ్మకాన్ని గెలవగలరని వ్యాఖ్య
ప్రభుత్వం యువత (జెన్-జీ) నమ్మకాన్ని గెలుచుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ మార్చుకోవాల్సింది కెమెరా యాంగిల్ కాదని, తన ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభలో వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, 2026పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ, సోషల్ మీడియా వీడియోలు, కొత్త కెమెరా యాంగిల్స్‌తో యువతలో విశ్వాసాన్ని నింపలేరని పేర్కొన్నారు.

"ఈ తరం యువతకు అన్నీ తెలుసు, వారికి నిజానిజాలను గుర్తించే విచక్షణ ఉంది. వారి మనసు గెలవాలంటే నిజాయతీ అవసరం" అని ప్రియాంక స్పష్టం చేశారు. ఇటీవల నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై నిరసన తెలిపిన విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

"విద్యార్థులపై భాష్పవాయువు ప్రయోగం, లాఠీఛార్జ్, వాటర్ కేనన్లు, పెల్లెట్ గన్స్, ఏకే-47లు వాడమని ఎవరు ఆదేశించారు? వారేమైనా ఉగ్రవాదులా?" అని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు. దీనికి యావత్ దేశం సమాధానం కోరుకుంటోందని అన్నారు.

నిరసనల్లో గాయపడిన ఓ విద్యార్థినిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పరామర్శించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, రాజకీయ నాయకులు పదేపదే వచ్చి వీడియోలు తీస్తుండటంతో ఆ విద్యార్థిని తల్లి అనుభవించిన వేదన తనను సిగ్గుపడేలా చేసిందని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు 2024లో తీసుకొచ్చిన చట్టం కింద ఇప్పటివరకు ఒక్కరిని కూడా శిక్షించలేదని ప్రియాంక విమర్శించారు. గత దశాబ్ద కాలంలో 152 పేపర్ లీకేజీలు చోటుచేసుకుని దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసినా, ఒక్క విద్యా మాఫియాను కూడా పట్టుకోలేకపోయారని ఆరోపించారు. కేవలం కమిటీలు వేస్తే సరిపోదని, జాతీయ విద్యా విధానంలో మార్పులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆమె సూచించారు.
Advertisement
Priyanka Gandhi Vadra
Narendra Modi
NEET paper leak
Lok Sabha debate
Public Examinations Bill 2026

More Telugu News