అమెరికా-ఇరాన్ టెన్షన్ కూల్.. మార్కెట్లలో భారీ జోష్
- భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
- 1300 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ
- భారీగా తగ్గిన ఇండియా వీఐఎక్స్, చమురు ధరలు
- పీఎస్యూ బ్యాంకులు, ఐటీ షేర్ల ర్యాలీ.. ఫార్మా డల్
ఇరాన్తో వివాదం ముగింపు దశకు రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడంతో ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వం వస్తుందన్న ఆశలు పెరిగాయి. ఈ సానుకూల పరిణామం భారత మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. దీంతో మార్కెట్లలో అస్థిరతను సూచించే ఇండియా వొలటిలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) ఏకంగా 15.4 శాతం తగ్గి 17.34 స్థాయికి పడిపోయింది. ఇది సమీప భవిష్యత్తులో మార్కెట్లలో అనిశ్చితి తగ్గుతుందని సూచిస్తోంది.
ఫ్రంట్లైన్ సూచీలతో పాటు బ్రాడర్ మార్కెట్లు కూడా రాణించాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు వరుసగా 2.09%, 2.10% మేర లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే, పీఎస్యూ బ్యాంకులు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించగా, ఫార్మా రంగం మాత్రం వెనుకబడింది. మరోవైపు, ఆసియా సెషన్లో ముడి చమురు ధరలు తగ్గడం కూడా సానుకూలాంశంగా మారింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 0.36% తగ్గి బ్యారెల్కు 94.45 డాలర్లకు చేరింది.