చెన్నైలో రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

Rajinikanth Dhanush Houses Receive Bomb Threats
షార్ట్స్‌లో చూడండి

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర నటుల ఇళ్లలో బాంబులు పెట్టినట్లు వచ్చిన సందేశం చెన్నై నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఈరోజు అందిన ఒక బెదిరింపు ఈమెయిల్ పోలీసు యంత్రాంగానికి ముచ్చెమటలు పట్టించింది. పోయెస్ గార్డెన్‌లోని సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం, అల్వార్‌పేటలో ఉన్న హీరో ధనుష్ ఇళ్లలో బాంబులు అమర్చామని, అవి ఏ క్షణమైనా పేలవచ్చని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ సమాచారం బయటకు రావడంతో ఒక్కసారిగా తమిళనాట అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.


ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కలిసి రంగంలోకి దిగారు. ఇద్దరు నటుల నివాసాల వద్దకు చేరుకున్న భద్రతా దళాలు సుమారు గంటన్నర పాటు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. ఇంటి లోపల, గార్డెన్ ప్రాంతం, పరిసరాల్లో అణువణువూ గాలించినా ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభించలేదు. చివరకు అది ఒక 'ఫేక్ మెయిల్' అని అధికారులు నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భయాందోళనలు సృష్టించేందుకే ఎవరో ఆకతాయిలు ఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.


గతంలోనూ విజయ్, అజిత్ వంటి ప్రముఖుల ఇళ్లకు ఇలాంటి బెదిరింపులు ఎదురైన సందర్భాలు ఉన్నప్పటికీ, ఈసారి నేరుగా డీజీపీ కార్యాలయానికే మెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఈమెయిల్ పంపిన వ్యక్తి ఎవరు? ఏ ఐపీ అడ్రస్ ద్వారా ఈ మెయిల్ పంపారనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం ఆరా తీస్తోంది. తప్పుడు సమాచారంతో ప్రజలను, పోలీసు యంత్రాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా రజనీకాంత్, ధనుష్ నివాసాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.

Go Back to Shorts
Rajinikanth
Dhanush
Chennai
bomb threat
Tamil Nadu DGP
Tamil cinema
police investigation
cyber crime
fake bomb threat
Vijay Ajith

More Telugu News