గంభీర్‌ కూడా బాధ్యత తీసుకోవాల్సిందే.. టీమిండియా ఓటమిపై మాజీ కెప్టెన్ ఫైర్‌

Gautam Gambhir criticized by Srikkanth for India series loss against England
  • గంభీర్‌పై మాజీ కెప్టెన్‌ శ్రీకాంత్‌ విమర్శలు
  • టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌
  • వరుస మార్పులతో ప్రపంచకప్‌కు సిద్ధం కాలేమని వ్యాఖ్య
  • కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ స్థానంపై అసంతృప్తి
  • బలమైన జట్లపై విజయాలే అసలు ప్రమాణమన్న మాజీ కెప్టెన్‌
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ఓటమి తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, జట్టు యాజమాన్యంపై మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ తీవ్ర విమర్శలు చేశారు. వరుసగా జట్టులో మార్పులు చేయడం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. 2027 ప్రపంచకప్‌కు ఇలాగే సిద్ధమైతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 2-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా శ్రీకాంత్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో స్పందించారు. జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్‌లాంటి జట్లపై విజయాలు సాధిస్తేనే భారత జట్టు మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. బలమైన జట్లపై గెలిచినప్పుడే అసలు ప్రమాణం తెలుస్తుందని పేర్కొన్నారు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు గంభీర్‌ కూడా ఈ ఫలితాలకు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వన్డే ప్రపంచకప్‌కు ముందు చాలా తక్కువ మ్యాచ్‌లు మాత్రమే ఉండటంతో ఇప్పుడైనా స్థిరమైన జట్టును తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

లార్డ్స్‌ వన్డేలో బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనా శ్రీకాంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో కేఎల్‌ రాహుల్‌ను ఆరో స్థానంలో పంపడం అర్థంలేని నిర్ణయమన్నారు. రోహిత్‌ శర్మ ఔటైన వెంటనే విరాట్‌ కోహ్లీకి తోడుగా రాహుల్‌ను పంపాల్సిందని అభిప్రాయపడ్డారు. 2023 ప్రపంచకప్‌లో కోహ్లీతో కలిసి రాహుల్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. మ్యాచ్‌ దాదాపు చేజారిపోయిన తర్వాత అతణ్ని క్రీజులోకి పంపడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు.
Advertisement
Gautam Gambhir
Krishnamachari Srikkanth
India vs England ODI
Team India management
KL Rahul batting order
Indian cricket team news

More Telugu News