Jairam Ramesh: మోదీ విదేశాంగ విధానం డొల్లతనం బయటపడింది: కాంగ్రెస్ ఫైర్

Jairam Ramesh criticizes Modis foreign policy
  • పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వేళ కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
  • స్వయం ప్రకటిత విశ్వగురు విదేశాంగ విధానం విఫలమైందన్న జైరాం రమేశ్
  • పాక్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాన్నిహిత్యంపై ఆందోళన
  • ఆపరేషన్ సింధూర్ నిలిపివేత వ్యాఖ్యలపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్
  • ఇజ్రాయెల్, చైనా అంశాల్లో కేంద్రం తీరును తప్పుబట్టిన కాంగ్రెస్
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ పార్టీ ఆదివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, పనితీరు వల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. దేశ విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందని, దీని డొల్లతనం ఇప్పుడు బయటపడిందని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు.

స్వయం ప్రకటిత 'విశ్వగురు' నాయకత్వంలో ఎంత ఆర్భాటం చేసినా వాస్తవం దాగదని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడులకు కారణమైన వ్యక్తులను, పాకిస్థాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రశంసిస్తున్నారని, ఆఫ్ఘనిస్థాన్‌కు వ్యతిరేకంగా పాక్‌కు అమెరికా మద్దతు ఇస్తోందని ఆయన గుర్తుచేశారు. అలాగే 'ఆపరేషన్ సిందూర్' అంశాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌పై టారిఫ్‌లు విధిస్తామని బెదిరించి, 2025 మే 10న ఆపరేషన్‌ను ఆపేశామని ట్రంప్ వందలసార్లు చెప్పుకున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. ఇక ఇరాన్‌పై యుద్ధం విషయంలో మోదీ ప్రభుత్వం స్పందించిన తీరు భారతీయ విలువలు, ప్రయోజనాలకు విరుద్ధమని జైరాం రమేశ్ మండిపడ్డారు. 2020 జూన్ 19న చైనాకు మోదీ క్లీన్ చిట్ ఇవ్వడం వల్లే లఢఖ్ సరిహద్దు చర్చల్లో భారత్ బలహీనపడిందని, ఇది అమరులైన జవాన్ల త్యాగాలను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా మోదీ విదేశాంగ విధానం దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.
Jairam Ramesh
Congress
Narendra Modi
Foreign Policy
India
West Asia
US
China
Pakistan

More Telugu News