దాడుల్లో వందల మంది అమాయకులు చనిపోయారు: భారత్లో ఇరాన్ రాయబారి ఫతాలీ
- ఒక్క మినాబ్ నగరంలోనే 50 మంది విద్యార్థినులు మరణించారన్న ఫతాలీ
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ క్షేమంగా ఉన్నారని వెల్లడి - ఇక చర్చల్లేవు... యుద్ధ భాషలోనే సమాధానం ఇస్తామని ప్రకటన
ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫతాలీ మాట్లాడుతూ.. ఈ దాడులను ఇరాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ముఖ్యంగా మినాబ్ నగరంలోని ఓ బాలికల పాఠశాల లక్ష్యంగా జరిగిన దాడిలో 50 మందికి పైగా విద్యార్థినులు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఇరాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదని, కానీ తమ దేశంపై దాడి జరిగితే ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణ కోసం దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక దౌత్యపరమైన చర్చలకు ఆస్కారం లేదని, యుద్ధ భాషలోనే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.
ఇక ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల భద్రతపై కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు భారతీయులకు ఎలాంటి హాని జరిగినట్లు సమాచారం లేదని తెలిపారు. అక్కడి అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఒకవేళ భారతీయులను వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే, భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని రాయబారి హామీ ఇచ్చారు.