Ramachander Rao: 6 మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ... కరీంనగర్, నిజామాబాద్ గెలుస్తున్నాం: రామచందర్ రావు

Ramachander Rao BJP claims single largest party in 6 municipalities
  • ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందన్న రామచందర్ రావు
  • హంగ్ వచ్చినా బీజేపీ ఎవరికీ మద్దతివ్వదని స్పష్టీకరణ
  • తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా
ఆరు మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందని, రెండు కార్పొరేషన్లు గెలుచుకోబోతున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందని అన్నారు. ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 250 వార్డుల్లో గెలిచామని పేర్కొన్నారు.

కరీంనగర్, నిజామాబాద్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతున్నామని వ్యాఖ్యానించారు. నారాయణపేట, ఆదిలాబాద్, రాయికల్ వంటి మున్సిపాలిటీల్లో బీజేపీ వారే ఛైర్మన్లు అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎక్స్ అఫిషియో, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఛైర్మన్ పదవులు దక్కించుకుంటామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తాము ఆశించిన మేర ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు.

త్రిముఖ పోరులో బీజేపీకి కొంత నష్టం జరిగిందని రామచందర్ రావు అన్నారు. అనేక చోట్ల హంగ్ వచ్చిందని తెలిపారు. ఇవి కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు కావని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఓడించడానికి పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలుచుకోగలిగిందని అన్నారు. హంగ్ వచ్చినా బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.

హైదరాబాద్ ప్రజలు ఆ మూడు పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉందని రామచందర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని, తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని, తమకు మద్దతు ఇస్తామంటే తీసుకుంటామని స్పష్టం చేశారు.
Ramachander Rao
BJP Telangana
Municipal Elections
Karimnagar
Nizamabad
Telangana Politics

More Telugu News