Nara Lokesh: విశాఖపట్నంలో ఐటీ కంపెనీల పండుగ! ఒకేరోజు 5 కంపెనీలకు లోకేశ్ భూమిపూజ

Nara Lokesh Launches 5 IT Companies in Visakhapatnam
  • ఉత్సాహంగా పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, ప్రజలు
  • సైల్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, ఐస్పేస్ సాఫ్ట్‌వేర్, టెక్ తమ్మిన తదితర కంపెనీలకు లోకేశ్ భూమిపూజ
  • వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు మంత్రి భూమిపూజ
విశాఖపట్నంలో సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ఒకరోజు ముందే ఐటీ పండుగ వచ్చింది. సమ్మిట్‌లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేశ్ గురువారం ఒకేరోజు 5 కంపెనీలకు భూమిపూజ చేశారు. పారిశ్రామికవేత్తలతో పాటు విశాఖ ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.3,800 కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 30 వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కంపెనీల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేశ్‌కు నగర ప్రజలు నీరాజనాలు పట్టారు.

భారత్‌లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖ గూగుల్ ఏఐ హబ్ ప్రకటన తర్వాత నగరానికి ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా, తాజాగా సైల్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, ఐస్పేస్ సాఫ్ట్‌వేర్, టెక్ తమ్మిన, ఫీనోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కె.రహేజా, కపిల్ గ్రూప్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు మంత్రి లోకేశ్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ ముతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, లోకం మాధవి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సెయిల్స్ సాఫ్ట్‌వేర్‌కు శంకుస్థాపన

విశాఖ మధురవాడ ఐటీ హిల్ నెం.2లో సెయిల్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్‌కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. మంత్రితోపాటు ఈ కార్యక్రమానికి హాజరైన సంస్థ ఎండీ & సీఈవో కిరణ్ మాట్లాడుతూ... విశాఖలో రూ.21 కోట్లతో సెయిల్ సంస్థ ఏర్పాటు చేసే ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా 430 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్, ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగించి అత్యాధునిక ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌పై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు.

ఐస్పేస్ సాఫ్ట్‌వేర్‌కు భూమిపూజ

విశాఖ మధురవాడ ఐటీ హిల్ నెం.2లో ఐస్పేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ యూనిట్‌కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు హాజరైన సంస్థ సీఈఓ రమేశ్ మాట్లాడుతూ... విశాఖలో తమ సంస్థ మూడు దశల్లో రూ.119.18 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా, 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఐటీఓ సేవల డెలివరీ కార్యకలాపాలను తాము విశాఖ యూనిట్ ద్వారా చేపడతామని తెలిపారు.

ఫీనోమ్ డెవలప్ మెంట్ సెంటర్‌కు భూమిపూజ

విశాఖ మధురవాడ ఐటీ హిల్ నెం.2లో ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. లోకేశ్‌తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ కో-ఫౌండర్ హరి బైర్రెడ్డి మాట్లాడుతూ... విశాఖ యూనిట్‌పై రెండు దశల్లో రూ.207.5 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా, 2,500 మంది ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. తాము అడ్వాన్స్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్, ఏఐ రీసెర్చి, కస్టమర్ డెలివరీ ఎక్సలెన్స్‌పై దృష్టిసారిస్తామని తెలిపారు.

రహేజా మిక్స్‌డ్ డెవలప్‌మెంట్ స్పేస్‌కు శంకుస్థాపన

విశాఖ మధురవాడ ఐటీ హిల్ నెం.3లో రహేజా సంస్థ ఐటీ స్పేస్/కమర్షియల్ స్పేస్ మిక్స్‌డ్ డెవలప్‌మెంట్ స్పేస్‌కు మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. మంత్రి వెంట కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ ప్రెసిడెంట్ రవి సి.రహేజా మాట్లాడుతూ... విశాఖలో రూ.2,172 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా, 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు.  ఐటీ కంపెనీలు, డాటా సెంటర్లు, జీసీసీ కంపెనీలకు అవసరమైన ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ లగ్జరీ ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు భూమిపూజ

విశాఖ యండాడలో కపిల్ గ్రూప్ అనుబంధ సంస్థ బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ఆధ్వర్యాన వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. మంత్రి లోకేశ్ వెంట కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ గ్రూప్ చైర్మన్ వామనరావు మాట్లాడుతూ... విశాఖలో రెండు విడతలుగా రూ.1,250 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా, 15 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఐటీ/ఐటీఈఎస్ ఆఫీసు స్పేస్, కమర్షియల్ స్పేస్ మిక్స్‌డ్ డెవలప్‌మెంట్ తోపాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడుల ఆకర్షణ, హైవ్యాల్యూ జాబ్ క్రియేషన్ లక్ష్యాలుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Nara Lokesh
Visakhapatnam
IT Companies
Andhra Pradesh
Investment
Job Creation

More Telugu News