Iran: అణు కేంద్రాలపై దాడులు.. తీవ్ర నష్టాన్ని అంగీకరించిన ఇరాన్

Iran Admits Heavy Damage from Nuclear Site Attacks
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల తమ దేశంలోని కీలక అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఇరాన్ అంగీకరించింది. ఈ దాడుల ప్రభావంపై తొలుత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘయీ స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తీరుపై కూడా ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్'

ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫహాన్‌లలో ఉన్న మూడు ప్రధాన అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇటీవల దాడులకు పాల్పడింది. ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ పేరిట జరిగిన ఈ దాడుల్లో బీ-2 స్పిరిట్ బాంబర్లను, శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను, టోమహాక్ క్షిపణులను అమెరికా ప్రయోగించింది. ఇజ్రాయెల్ కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ దాడులతో ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. అయితే, తొలినాళ్లలో చైనాకు చెందిన నిపుణులు మాత్రం అమెరికా ప్రయోగించిన బాంబుల స్థాయి, అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి సరిపోదని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌కు పరిమితంగానే నష్టం వాటిల్లిందని కొన్ని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా సూచించాయి.

నష్టాన్ని అంగీకరించిన ఇరాన్

ఈ ఊహాగానాల నేపథ్యంలో, ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘయీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. అమెరికా దాడుల వల్ల తమ అణు కేంద్రాలకు తీవ్రమైన నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. "పదేపదే జరిగిన దాడులతో మా అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నది మాత్రం స్పష్టం" అని బఘయీ తెలిపారు. అయితే, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఇరాన్ అణు సంస్థ, ఇతర సంబంధిత ఏజెన్సీలు ప్రస్తుతం పరిస్థితిని, నష్టాన్ని అంచనా వేస్తున్నాయని ఆయన వివరించారు.

ఐఏఈఏతో తెగదెంపులకు సిద్ధం

మరోవైపు, తమ అణు కేంద్రాలపై జరిగిన దాడుల విషయంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) వ్యవహరించిన తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అణు కేంద్రాల భద్రతకు పూర్తిస్థాయిలో హామీ ఇచ్చే వరకు ఐఏఈఏకు అందిస్తున్న సహకారాన్ని నిలిపివేయాలని ఇరాన్ పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఈ విషయంపై పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలిబాఫ్ మాట్లాడుతూ, "ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడులను ఖండించడానికి ఐఏఈఏ నిరాకరించింది. దీనిద్వారా ఆ సంస్థ తన విశ్వసనీయతను వేలానికి పెట్టినట్లయింది" అని విమర్శించారు.
Go Back to Shorts
Iran
Iran nuclear program
Ismail Baghaei
nuclear attacks
IAEA

More Telugu News