MS Dhoni: కెరీర్ లో 400వ టీ20 ఆడబోతున్న ధోనీ

- నేడు చెన్నైలో సన్రైజర్స్ హైదరాబాద్తో సీఎస్కే పోరు
- ధోనీకి కెరీర్లో ఇది 400వ టీ20 మ్యాచ్
- ఈ మైలురాయి అందుకున్న నాలుగో భారత ఆటగాడిగా రికార్డ్
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు ధోనీ తన సుదీర్ఘ టీ20 కెరీర్లో మరో కీలక ఘట్టానికి చేరువయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరగనున్న మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా ధోనీ తన 400వ టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. ఈ అరుదైన మైలురాయిని అందుకోనున్న నాలుగో భారత క్రికెటర్గా నిలవనున్నాడు.
ప్రపంచ క్రికెట్లో టీ20 ఫార్మాట్లో 400 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ధోనీ 24వ స్థానంలో చేరనున్నాడు.
ఇప్పటికే భారత్ నుంచి రోహిత్ శర్మ (456 మ్యాచ్లు), దినేశ్ కార్తిక్ (412 మ్యాచ్లు), విరాట్ కోహ్లీ (408 మ్యాచ్లు) ఈ ఘనతను సాధించారు. ఇప్పుడు వారి సరసన ఎంఎస్ ధోనీ కూడా చేరబోతున్నాడు. టీమిండియాకు, సీఎస్కేకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ, ఈ ఫార్మాట్లో తనదైన ముద్ర వేశాడు.
ఈ మైలురాయితో పాటు, ధోనీ మరో ప్రత్యేకతను కూడా సొంతం చేసుకోబోతున్నాడు. 400 టీ20 మ్యాచ్లు ఆడిన రెండో భారత వికెట్ కీపర్గా రికార్డు సృష్టించబోతున్నాడు. ఇంతకుముందు దినేశ్ కార్తిక్ మాత్రమే వికెట్ కీపర్గా భారత్ నుంచి ఈ ఘనతను అందుకున్నారు. చెపాక్ స్టేడియంలో జరిగే నేటి మ్యాచ్లో ధోనీ బరిలోకి దిగితే, ఈ రికార్డులు అతడి ఖాతాలో చేరతాయి. సీఎస్కే అభిమానులు ఈ ప్రత్యేక సందర్భాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.