ఈ కండక్టర్ ప్రయాణికుల ఫ్రెండ్లీ.. ఫోన్ చేసి అభినందించిన ఏపీ రవాణాశాఖ మంత్రి!

Tenali RTC Conductor Paruchuri Sudhakar Rao Passenger Friendly
  • తెనాలి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న పరుచూరి సుధాకర్‌రావు
  • బస్సెక్కే ప్రయాణికులకు ధన్యవాదాలు చెబుతూ ఆహ్వానం
  • బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అనౌన్స్‌మెంట్
  • బస్సు దిగే ప్రయాణికులకు ధన్యవాదాలు
  • ఆర్టీసీకి అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
కొందరు తాము ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికే వన్నెతెస్తారు. చేస్తున్న ఉద్యోగం గౌరవం పెంచుతారు. అలుపుసొలుపు లేకుండా పనిచేసుకుంటూ వెళ్తారు. విసుగన్నదే ముఖంలో కనిపించనివ్వరు. అలాంటి వారిలో ఒకరు పరుచూరి సుధాకర్‌రావు. తెనాలి ఆర్టీసీ డిపోలో ఆయన కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కగానే.. ఆర్టీసీ బస్సు ఎక్కినందుకు ధన్యవాదాలు చెబుతారు. మరికాసేపట్లో పలానా స్టేజీ వస్తుందని గట్టిగా చెబుతారు. ప్రయాణికులతో మాటలు కలుపుతారు. బస్సు దిగే ప్రయాణికులకు కూడా ధన్యవాదాలు చెబుతారు.

తాజాగా, ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ కావడంతో సుధాకర్‌రావుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నిన్న ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. ఆర్టీసీకి మీరు అందిస్తున్న సేవలు ముచ్చటగొలుపుతున్నాయని ప్రశంసించారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ప్రసాదరావు బస్సెక్కిన విద్యార్థులతో మాటలు కలిపారు. రవాణాశాఖమంత్రి ఎవరని వారిని ప్రశ్నించారు. తమకు తెలియదని వారు చెప్పడంతో రాంప్రసాద్‌రెడ్డి అని, ఆయన కడప జిల్లా రాయచోటి నుంచి గెలిచారని పిల్లలకు చెప్పారు. ముఖ్యమంత్రిని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటారో, ప్రతి మంత్రిని అలానే గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. బస్సు దిగుతున్న పిల్లలు, ఇతర ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. ఆపై బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పారు.
Go Back to Shorts
Tenali Conductor
Paruchuri Sudhakar Rao
APS RTC

More Telugu News