KTR: చేనేత కార్మికుల సమస్యపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

KTR letter to CM Revanth Reddy on handloom workers
  • నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని విమర్శ
  • ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా? అని నిలదీత
  • కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా? అని ఆగ్రహం
  • పదేళ్ల తర్వాత తెలంగాణలో సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం కనిపిస్తోందని ఆగ్రహం
చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆ లేఖలో ఆరోపించారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ఆదుకోరా? కార్మికులు రోడ్డునపడ్డా కనికరించరా? అని ప్రశ్నించారు. పదేళ్ల తర్వాత సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నేతన్నల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయన్నారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని ధ్వజమెత్తారు.

గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల నిలిపివేసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. చేనేతమిత్ర వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.

ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని, అవసరమైతే మరింత సాయం చేయాలని కోరారు. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదని అన్నారు. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
KTR
Revanth Reddy
BRS
Congress

More Telugu News