జూబ్లీహిల్స్‌లో దేశ ద్రోహులు ఎక్కువ.. తక్కువ ఓటింగ్‌పై డైరెక్టర్ తేజ

There are more traitors in Jubilee Hill says Director Teja
తెలంగాణ శాసనసభ ఎన్నికలు-2023 ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈసారి ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే పలువురు రాజకీయ, సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఆదర్శప్రాయంగా నిలిచారు. వారిలో సినీ డైరెక్టర్ తేజా ఒకరు. అయితే ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ఓటు వేయని వారందరూ దేశద్రోహులని అన్నారు.

‘‘మామూలుగా అందరూ రోడ్లు బాగాలేవని, స్కూల్స్ బాగాలేవని ఫిర్యాదులు చేస్తుంటారు. నీళ్లు సరిగా రావడం లేదు అంటూ కంప్లైంట్లు చేస్తుంటారు. ఫిర్యాదు చేసేవారందరూ బయటకు వచ్చి ఓటు వేయాలి. లేదంటే ఫిర్యాదు ఇచ్చేవారికి అర్హత ఉండదు. ఓట్లు వేయని వారందరూ దేశద్రోహులు. ఆరోగ్యం బాగున్నప్పుడు బయటకు వచ్చి ఓటు వేయాలి. పెద్ద పెద్ద వయసు వాళ్లు కూడా వీల్ చైర్‌లో వచ్చి ఓటు వేస్తున్నారు. వీళ్లు మాత్రం వేయరు. జూబ్లీహిల్స్‌లో ఓటింగ్ తక్కువగా ఉంటుంది. అంటే దేశద్రోహులు ఎక్కువగా ఉన్నట్టు అర్థం. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ బయటకు వచ్చి ఓటు వేయని వారందరూ దేశద్రోహులు’’ అని తేజా అన్నారు.

ఇక తొలిసారి ఓటర్లకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించగా.. ‘‘ ఓటు వేయండి. ఇది మన దేశం. మన దేశాన్ని మనం మార్చుకుందాం. మంచి లీడర్లు రావాలంటూ అందరూ వచ్చి ఓటు వేయాలి’’ అని తేజ అన్నారు. ఈ మేరకు తేజా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Go Back to Shorts
Jubilee Hills
Telangana Assembly Election
Telangana plolling
Director Teja

More Telugu News