Advertisement

కుట్రలు చేసే బీజేపీకి మనం ఎందుకు ఓటు వేయాలి?: ముఖ్యమంత్రి కేసీఆర్

chief minister kcr says centre conspiracy on telangana
  • మోదీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినా, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని విమర్శ
  • ఈ నెల 30వ తేదీన మనం గొర్రెలు కాదని నిరూపించుకోవాలన్న కేసీఆర్
  • కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు.. సచ్చేది లేదని వ్యాఖ్య
మన మీద కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గజ్వేల్‍‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీ దేశం మొత్తం మీద 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, కానీ వందసార్లు అడిగినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ఆరోపించారు. జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలని, కానీ మనకు అలా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? మనం ఏమైనా పిచ్చివాళ్లమా? అన్నారు. మనమంతా గొర్రెలం కాదని ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ సందర్భంగా నిరూపించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు.. సచ్చేది లేదన్నారు. కానీ వారు గెలిస్తే ఇందిరమ్మ రాజ్యమంటున్నారని... కానీ అది ఆకలి చావుల ఇందిరమ్మ రాజ్యం అని ఆరోపించారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, టీపీసీసీ అధ్యక్షుడేమో రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచి నన్ను రెండుసార్లు గెలిపించారని, ఈసారి మళ్లీ ఆశీర్వదిస్తే ఐటీ టవర్లు తీసుకు వచ్చే బాధ్యత తనదే అన్నారు. మల్లన్న ముంపుసాగర్ బాధితులకు కాలుష్యరహిత పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. ట్రిపుల్ ఆర్ అయితే గజ్వేల్ దశ మారిపోతుందన్నారు.
Advertisement
KCR
Telangana Assembly Election
BRS
BJP

More Telugu News