రాహుల్ మేడిగడ్డ మీద నుండి దూకితే కాళేశ్వరం గురించి తెలుస్తుంది: మంత్రి జగదీశ్ రెడ్డి

Minister Jagadish Reddy comments on Rahul Gandhi
  • రాహుల్ గాంధీ లీడర్ కాదు.. ఓ రీడర్ అన్న మంత్రి
  • రూ.4వేల పింఛన్ ఇస్తామని ఏ హోదాలో ప్రకటించారని ప్రశ్న
  • కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇవ్వకుండా తెలంగాణలో ప్రకటించడానికి సిగ్గుండాలన్నారు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లీడర్ కాదని, ఆయన ఓ రీడర్ అని మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం విమర్శించారు. రాసిచ్చింది చదవడం తప్ప ఆయన చేస్తున్న పని ఏమిటన్నారు. రెండుసార్లు పార్టీ అధ్యక్ష పదవిని మధ్యలోనే వదిలి పెట్టాడని ఎద్దేవా చేశారు. నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడినా రాహుల్ గాంధీనే ఉటంకించారన్నారు. మోదీకి రాహుల్ గుత్తేదారు అని విమర్శించారు. రూ.4వేలు పింఛన్ ఇస్తామని ఏ హోదాలో ప్రకటించారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత పింఛన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రూ.4వేల పింఛన్ నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీని కొనఊపిరితో బతికిస్తున్న ఛత్తీస్‌గఢ్ లో వృద్ధులకు రూ.350 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. చనిపోయిందనుకున్న ఆ పార్టీకి జీవం పోసిన కర్ణాటకలోను ఇచ్చేది తక్కువే అన్నారు. అందుకే రాహుల్ ను లీడర్ గా కాకుండా, రీడర్ గా చూడవలసి వస్తోందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో లేని పింఛన్ ను తెలంగాణలో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గుండాలన్నారు. రూ.4వేల పింఛన్ నమ్మశక్యంగా లేదన్నారు.

ఇప్పటికే తమ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.4,000, వృద్ధులకు రూ.2,016 ఇస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.1 లక్ష కోట్లతోనే కట్టామని, ఇక అందులో అవినీతి ఎక్కడ? అన్నారు. అవినీతి ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పెట్టిందన్నారు. మేడిగడ్డ మీద నుండి దూకితే కాళేశ్వరం కట్టింది నిజమో.. కాదో రాహుల్ కు తెలుస్తుందన్నారు.
Go Back to Shorts
G Jagadish Reddy
Rahul Gandhi

More Telugu News