ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. కాసేపట్లో రాష్ట్రపతి ముర్మును కలవనున్న టీడీపీ అధినేత!

Chandrababu to meet Droupadi Murmu in Delhi
  • ఢిల్లీలో చంద్రబాబుకు స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు
  • మోదీ అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు
  • రాత్రి 8.15 గంటలకు హైదరాబాద్ కు తిరుగుపయనం
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం వారు అక్కడి నుంచి ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు. అక్కడ పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ప్రతిపాదించిన ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. 

మరోవైపు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 8.15 గంటలకు ఆయన హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు. మరోవైపు, సీఎం జగన్ కూడా ఈ రాత్రికి ఢిల్లీకి వెళ్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన హస్తినలోనే గడపనున్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Delhi
Droupadi Murmu
President Of India
Narendra Modi
BJP

More Telugu News