Advertisement

పేపర్ లీకులను విద్యార్థులు సవాలుగా తీసుకున్నారు: నిర్మలా సీతారామన్

Students took paper leaks as a challenge says Nirmala Sitharaman
  • పేపర్ లీక్‌లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు
  • లీకుల తర్వాత విద్యార్థులు మరింత పట్టుదలతో చదివారని వెల్లడి
  • నిందితులపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ప్రకటన
  • ఎన్టీఏ ఏజెన్సీలో భారీ మార్పులు, 47 మంది తొలగింపు
  • విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌ను తిరస్కరించిన కేంద్రం
దేశవ్యాప్తంగా పరీక్ష పేపర్ల లీకేజీలపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీల ఘటనలను చాలా మంది విద్యార్థులు ఒక సవాలుగా తీసుకున్నారని ఆమె తెలిపారు. లీక్ ఘటనల తర్వాత వారు మరింత కష్టపడి చదివి, మంచి మార్కులు సాధించారని చెప్పారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.

పరీక్షల పవిత్రతను దెబ్బతీసిన వారిపై వేగంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని నిర్మల చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తిరిగి పరీక్షలు నిర్వహించిందని గుర్తుచేశారు. సమయానికి ఫలితాలు విడుదల చేయడం వల్ల విద్యార్థులు తమ ఉన్నత చదువులను కొనసాగించగలుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో స్పందించింది కాబట్టే విపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆమె అన్నారు.

ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేపర్లను అమ్మిన, కొనుగోలు చేసిన వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేశామని చెప్పారు. మరోవైపు ఎన్టీఏ సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 47 మంది ఉద్యోగులను ఇప్పటికే విధుల నుంచి తొలగించారు.

అయినా జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, బీజేపీ నాయకత్వం ఆయనకు పూర్తి మద్దతుగా ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
Advertisement
Nirmala Sitharaman
Paper Leak Case
National Testing Agency NTA
Narendra Modi
Dharmendra Pradhan
Jantar Mantar Protests

More Telugu News