Advertisement

హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత.. భారతీయులు ఉన్న ఎల్‌పీజీ ట్యాంకర్‌పై క్షిపణి దాడి!

Strait of Hormuz Tension Missile Attack on LPG Tanker with Indians
  • ఇరాన్ భూభాగంలో దాడికి గురైన మొజాంబిక్ నౌక 'దిశ' 
  • నౌకలోని 28 మంది భారతీయ సిబ్బంది సురక్షితమని ప్రకటన
  • హర్మూజ్ జలసంధి సమీపంలో ఎమర్జెన్సీ కాల్ ఆధారాలు లభ్యం 
  • ఇంజిన్ రూమ్‌ను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికల అనంతరం దాడి 
  • ఆ ప్రాంతానికి భారత నావికుల ప్రయాణాలపై గతంలోనే ఆంక్షలు
 గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. అత్యంత సమస్యాత్మకమైన హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ప్రాంతీయ జలాల్లో 28 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఒక ఎల్‌పీజీ ట్యాంకర్‌పై జరిగిన క్షిపణి దాడి కలకలం రేపింది. దాడికి గురైన మొజాంబిక్ పతాకంతో వెళ్తున్న 'దిశ' నౌకలోని భారతీయులందరూ క్షేమంగా ఉన్నట్లు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

సమాచారం అందుకున్న తక్షణమే భారత ఎంబసీ స్థానిక ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే విదేశీ రేడియో వార్తా కథనాల ప్రకారం.. అమెరికా మిలిటరీ ఆపరేటర్ సదరు నౌకను ఇరాన్ జలాల వైపు వెళ్లవద్దని, అలా వెళ్తే ఇంజిన్ రూమ్‌పై దాడి చేస్తామని హెచ్చరించినట్లు చెబుతున్న ఆడియో రికార్డింగ్‌లు బయటపడ్డాయి. ఆ హెచ్చరికల ముగిసిన కాసేపటికే.. "మాపై గుర్తుతెలియని క్షిపణులతో దాడి జరిగింది, అత్యవసర సహాయం కావాలి" అంటూ 'దిశ' నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ రావడం గమనార్హం.

మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల్లో భారతీయ సీఫేరర్లను (నావికులను) నియమించవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మేరిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎంఏ) నౌకాయాన సంస్థలను ఇటీవలే ఆదేశించింది. భారతీయ నావిక సిబ్బంది రక్షణ, భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసినప్పటికీ, ఈ లోపే ఈ దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
Advertisement
Strait of Hormuz
LPG Tanker Disha
Indian Sailors
Missile Attack
Iran
Gulf Security Crisis

More Telugu News