Advertisement

సొంతంగా మందులు తెచ్చుకొని వేసుకుంటున్నారా? మీ ఆరోగ్యంతో మీరు ఆటాడుకుంటున్నట్లే!

Self Medication Dangers Of Taking Medicines Without Doctor Prescription
  • మెడికల్‌ షాపులో మాత్రలు తెచ్చుకొని వేసుకోవడం అలవాటైన వైనం
  • లక్షణాలు తగ్గినా అసలు వ్యాధి మరుగున పడే ప్రమాదం
  • లోపల వ్యాధి ముదిరి ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశం
  • తరచూ మందులు తీసుకుంటే కాలేయం, కిడ్నీలకు ప్రమాదం
  • ఇప్పటికే తీసుకుంటున్న మందులపై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్‌
  • లక్షణాలు కొనసాగితే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలని సూచన
తలనొప్పి, జ్వరం, గొంతు నొప్పి ఇలా కొన్ని అనారోగ్య సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా నేరుగా మెడికల్ షాపులో మందులు కొనుక్కొని వేసుకోవడం ఇప్పుడు చాలామందికి అలవాటైపోయింది. ఇంట్లో మిగిలిపోయిన మాత్రలు, బంధుమిత్రుల సలహాలు, సోషల్ మీడియాలో కనిపించే ఆరోగ్య చిట్కాలు కూడా ఈ అలవాటును పెంచుతున్నాయి. 

అయితే క్షణాల్లో ఉపశమనం ఇచ్చే ఈ స్వీయ వైద్యం.. కొన్నిసార్లు శరీరానికి కనిపించని ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పరీక్షలు లేకుండా మందులు వాడటం ఆరోగ్యాన్ని కాపాడదు.. మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశమే ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

వ్యాధి దాగిపోతుంది
మన శరీరం ఇచ్చే ప్రతి లక్షణం వెనుక ఒక కారణం ఉంటుంది. జ్వరం, తలనొప్పి, అలసట, కడుపునొప్పి వంటి సమస్యలను మాత్రలతో అణచేవేస్తే అసలు వ్యాధి బయటపడకుండా దాగిపోతుంది. దీంతో క్యాన్సర్‌, ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర తీవ్రమైన వ్యాధులు గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. కొంతకాలం ఉపశమనం లభించినా, వ్యాధి లోపల మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే లక్షణాలకే కాదు.. వాటి మూలానికి చికిత్స అవసరమని వైద్యులు చెబుతున్నారు.

మాత్రల మోత ముప్పే
మెడికల్ షాపులో సులభంగా దొరుకుతున్నాయనే కారణంతో యాంటీబయాటిక్స్‌, పెయిన్‌కిల్లర్స్‌, స్టెరాయిడ్స్‌ను ఇష్టానుసారం వాడటం చాలా ప్రమాదకరం. అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆ మందులు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. తరచూ నొప్పి మందులు వాడితే కిడ్నీలు, గట్‌ హెల్త్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. పారాసిటమాల్‌ను మోతాదుకు మించి తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది. స్టెరాయిడ్స్‌ను వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడితే రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు షుగర్ స్థాయులు కూడా పెరగవచ్చు.

కలిపి వాడితే కష్టం
చాలామంది ఇప్పటికే బీపీ, షుగర్‌, థైరాయిడ్‌, గుండె సంబంధిత సమస్యలకు మందులు వాడుతుంటారు. అలాంటి వారు మరో మందును స్వయంగా తీసుకుంటే రెండు మందుల మధ్య ప్రతికూల ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దగ్గు సిరప్‌, అలర్జీ మాత్రలు, హెర్బల్ సప్లిమెంట్లు కూడా ఇతర మందుల పనితీరును మార్చేయొచ్చు. ఫలితంగా చికిత్స ప్రభావం తగ్గడం లేదా తీవ్రమైన దుష్ప్రభావాలు రావడం జరుగుతుంది. అందుకే ఏ కొత్త మందైనా తీసుకునే ముందు వైద్యుడికి లేదా ఫార్మసిస్ట్‌కు ఇప్పటికే వాడుతున్న మందుల గురించి చెప్పడం తప్పనిసరి.

డాక్టర్‌నే ఆశ్రయించండి
రెండు మూడు రోజులకు మించి జ్వరం కొనసాగినా, తరచూ తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మలంలో లేదా మూత్రంలో రక్తం కనిపించడం, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కిడ్నీ లేదా కాలేయ సమస్యలతో బాధపడేవారు డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులూ వాడకూడదు. ఆరోగ్యం విషయంలో వేగవంతమైన పరిష్కారాల కంటే సరైన నిర్ధారణ, సరైన చికిత్సే శాశ్వత రక్షణ అని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Self Medication
Health Risks
Antibiotic Resistance
Painkillers Side Effects
Doctor Consultation
Organ Damage

More Telugu News