సినీ నటి హంసానందినికి బ్రెస్ట్ క్యాన్సర్!
- 4 నెలల క్రితం రొమ్ములో కణితి ఉన్నట్టు అనిపించిందన్న హంస
- వైద్య పరీక్షల్లో క్యాన్సర్ గ్రేడ్-3 దశలో ఉన్నట్టు తేలిందని వెల్లడి
- ఇప్పటి వరకు 9 విడతల కీమోథెరపీ జరిగిందని వ్యాఖ్య
తాను క్యాన్సర్ బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదని... భయంతో, ప్రతికూల భావాలతో జీవించబోనని హంస తెలిపారు. ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేయాలనుకుంటున్నానని చెప్పారు. తన తల్లి 18 ఏళ్ల క్రితం క్యాన్సర్ తో కన్నుమూశారని... ఆ రోజు నుంచి తాను ఆ భయంతోనే జీవిస్తున్నానని తెలిపారు. నాలుగు నెలల క్రితం తనకు రొమ్ములో కణితి ఉన్నట్టు అనిపించిందని... వెంటనే డాక్టర్ ను సంప్రదించానని చెప్పారు. వైద్య పరీక్షల్లో రొమ్ము క్యాన్సర్ గ్రేడ్-3 దశలో ఉన్నట్టు తేలిందని అన్నారు.
అయితే క్యాన్సర్ తొలి దశలోనే ఉందన్న తన ఆనందం ఎంతోసేపు కొనసాగలేదని... తనకు జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్టు దాక్టర్లు నిర్ధారించారని హంసానందిని తెలిపారు. వైద్యులు చెప్పినదాని ప్రకారం తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70 శాతం లేదా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40 శాతం ఉందని... దీంతో సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇప్పటి వరకు 9 విడతల కీమోథెరపీ చేయించుకున్నానని... మరో 7 విడతల థెరపీలు చేయించుకోవాల్సి ఉందని అన్నారు.
క్యాన్సర్ మహమ్మారికి తన జీవితాన్ని బానిసగా చేయదల్చుకోలేదని... మహమ్మారిపై నవ్వుతూ పోరాడుతూ, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తానని చెప్పారు. అందరిలో ప్రేరణను నింపడానికి ఈ విషయాన్ని చెపుతున్నానని తెలిపారు. హంసానందిని క్యాన్సర్ బారిన పడిందనే వార్తలతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.