Doctor Sudhakar: నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి

Doctor Sudhakar died with Heart Attack in Visakhapatnam
  • ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవంటూ ప్రభుత్వంపై విమర్శలు
  • విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం
  • కేసును సీబీఐకి అప్పగించిన కోర్టు
  • తీర్పు రాకముందే మృతి
నర్సీంపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ (52) గుండెపోటుతో నిన్న మృతి చెందారు. గతేడాది కరోనా రోగులకు సేవలు అందించిన డాక్టర్ సుధాకర్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వాధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ప్రభుత్వం సుధాకర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.

 నడిరోడ్డుపై పోలీసులు ఆయనను చిత్రహింసలకు గురిచేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సుధాకర్ మానసిక స్థితి బాగాలేదంటూ విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. దీంతో సుధాకర్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడం అప్పట్లో సంచలనమైంది. త్వరలోనే ఈ కేసులో తీర్పు రావాల్సి ఉండగా అంతలోనే ఆయన మరణించారు. కాగా, సుధాకర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విశాఖపట్టణంలోని సీతమ్మధారలో ఉంటున్న డాక్టర్ సుధాకర్ నిన్న ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు.
Doctor Sudhakar
Narsipatnam
Visakhapatnam District
Andhra Pradesh

More Telugu News