మహారాష్ట్ర గవర్నర్ కు అవమానం... ప్రభుత్వ విమానంలో వెళ్లేందుకు అనుమతి నిరాకరణ!
- ఉద్ధవ్, కోష్యారీ మధ్య విభేదాలు
- మరోసారి బయటపడిన వైనం
- డెహ్రాడూన్ వెళ్లాలని భావించిన గవర్నర్
- అనుమతి కోసం రెండు గంటలు ఎదురుచూపులు
- టేకాఫ్ కు అనుమతి రాలేదన్న ఫ్లయిట్ కెప్టెన్
- మరో విమానంలో వెళ్లిపోయిన గవర్నర్
కోష్యారీ డెహ్రాడూన్ వెళ్లేందుకు ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకోగా, ప్రభుత్వ విమానంలో ప్రయాణించేందుకు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎయిర్ పోర్టుకు వచ్చిన గవర్నర్ విమానంలో ఎక్కేందుకే రెండు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. విమానం ఎక్కిన తర్వాత కూడా పావుగంట సేపు కూర్చున్నారు. అయితే తనకు టేకాఫ్ కు అనుమతి రాలేదంటూ ఫ్లయిట్ కెప్టెన్ చెప్పడంతో గవర్నర్ కోష్యారీ చేసేది లేక ఆ విమానం నుంచి దిగి, మరో విమానంలో టికెట్ బుక్ చేసుకుని డెహ్రాడూన్ పయనం అయ్యారు.
దీనిపై గవర్నర్ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ డెహ్రాడూన్ పర్యటనపై వారం కిందటే ప్రభుత్వానికి సమాచారం అందించామని, అయినప్పటికీ అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్ విమాన ప్రయాణం అంశంపై తన కార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుంటానని వెల్లడించారు.