PCB: పాక్ క్రికెటర్లకు కొత్త రూల్.. రాజకీయ పోస్టులు పెడితే కోటి ఫైన్!

Pakistan Cricket Board Warns Players Of 1 Crore Fine After Naseem Shahs Controversial Jibe At Minister
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీం షాకు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారీ జరిమానా విధించింది. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ చేసినందుకు గానూ అతడికి 72,000 అమెరికన్ డాలర్లు (పాకిస్థాన్ కరెన్సీలో సుమారు రూ. 2 కోట్లు) ఫైన్ వేసింది. ఈ ఘటన నేపథ్యంలో, కేంద్ర కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లందరికీ పీసీబీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై రాజకీయపరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే... ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్‌) 2026 ప్రారంభ మ్యాచ్‌కు పంజాబ్ సీఎం మరియం నవాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు కూతురు వరుస అవుతుంది. 

అయితే, నసీం షా సోషల్ మీడియాలో "గడాఫీ స్టేడియంలో ఆమెకు రాణికి ఇచ్చినంత గౌరవం ఎందుకు ఇస్తున్నారు?" అని వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. గల్ఫ్ యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వ పొదుపు చర్యల్లో భాగంగా అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించని సమయంలో ఒక రాజకీయ నాయకురాలికి ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడంపై ఈ పోస్ట్ దుమారం రేపింది.

ఈ పోస్ట్‌ను వెంటనే తొలగించి, తన ఖాతా హ్యాక్ అయిందని నసీం షా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ వాదనను పీసీబీ అంగీకరించలేదు. ఈ నెల‌ 27న అతడికి షోకాజ్ నోటీసు జారీ చేసి, విచారణ చేపట్టింది. క్రమశిక్షణ కమిటీ విచారణ అనంతరం సెంట్రల్ కాంట్రాక్ట్ నిబంధనలను, సోషల్ మీడియా మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేల్చి రూ. 2 కోట్ల జరిమానా విధించింది. నసీం షా బేషరతుగా క్షమాపణ చెప్పినట్లు బోర్డు తెలిపింది. ఈ ఘటనకు బాధ్యుడిగా అతడి సోషల్ మీడియా సలహాదారుడిని కూడా విధుల నుంచి తొలగించి, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

ఈ నేపథ్యంలో ఆటగాళ్ల సోషల్ మీడియా వినియోగంపై పీసీబీ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. జియో న్యూస్ కథనం ప్రకారం.. ఇకపై బోర్డు మీడియా విభాగం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి రాజకీయపరమైన పోస్టులు పెట్టరాదని ఆటగాళ్లకు, వారి మేనేజర్లకు స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కనీసం కోటి రూపాయల‌ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రాజకీయ పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బోర్డు స్ప‌ష్టం చేసింది.
Go Back to Shorts
PCB
Naseem Shah
Pakistan Cricket Board
Maryam Nawaz
PSL 2026
Pakistan Super League
Social Media Policy
Cricket Fine
Political Posts
Gaddafi Stadium

More Telugu News