Bhuma Karunakar Reddy: నన్ను క్రిస్టియన్ అంటారా?... కూటమి ప్రభుత్వ పెద్దలపై భూమన ఎదురుదాడి

Bhuma Karunakar Reddy Counterattacks on Christian Allegations
  • తన కుమార్తె వివాహం తిరుచానూరులో హిందూ సంప్రదాయ ప్రకారమే జరిగిందని స్పష్టీకరణ
  • బైబిల్ పట్టుకున్న చంద్రబాబు, ముస్లిం వేషంలో లోకేశ్ ఫోటోలను ప్రస్తావించిన భూమన
  • పవన్ కల్యాణ్ భార్య క్రిస్టియన్ కాదా అని ప్రశ్నిస్తూ, తనపై విమర్శలను తిప్పికొట్టిన వైనం
  • టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణలను ఖండన, నిబంధనలు కఠినతరం చేశానని వెల్లడి
వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను క్రిస్టియన్ అంటూ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల మత విశ్వాసాలపై సూటి ప్రశ్నలు సంధించారు. ఫోటోలను సాక్ష్యాలుగా చూపుతూ విమర్శనాస్త్రాలు సంధించారు.

తన కుమార్తె వివాహం క్రైస్తవ మతం ప్రకారం జరిగిందని ఆరోపించడంపై భూమన తీవ్రంగా స్పందించారు. "నా కుమార్తె వివాహం తిరుచానూరు అమ్మవారి ఆశీస్సులతో 30 వేల మంది అతిథుల సమక్షంలో జరిగింది. ఆ పెళ్లికి మీ వియ్యంకుడు, నాకు ఆత్మీయుడైన బాలకృష్ణ, మీ తమ్ముడు, నా మిత్రుడైన నారా రామ్మూర్తి నాయుడు, 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. దేవదేవుని సాక్షిగా వేద మంత్రోచ్ఛారణల మధ్య హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేశానని ప్రమాణం చేస్తున్నా. శాసనసభలో నా ఫోటోను ప్రదర్శించి నన్ను క్రిస్టియన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది పచ్చి అబద్ధం" అంటూ చంద్రబాబుపై భూమన ధ్వజమెత్తారు.

ఈ క్రమంలో చంద్రబాబు, లోకేశ్, పవన్‌లను లక్ష్యంగా చేసుకుని భూమన ఎదురుదాడికి దిగారు. "బైబిల్ పట్టుకుని ఉన్న ఫోటోలు మీవి కోకొల్లలుగా ఉన్నాయి. మరి మిమ్మల్ని క్రిస్టియన్ అనాలా? మీ కుమారుడు లోకేశ్ ముస్లిం వేషధారణలో వంగి వంగి దండాలు పెడుతున్న ఫోటోలు ఉన్నాయి. మరి లోకేశ్ ను ముస్లిం అనాలా? 'లోకేశ్ సలాం భాయ్' అనాలా? క్రిస్టియన్ యువతులతో లోకేశ్ తిరుగుతున్న ఫోటోలు చూపి ఆయన్ను క్రిస్టియన్ అనాలా?" అని భూమన ప్రశ్నించారు. అలాగే, "పవన్ కల్యాణ్ మూడో భార్య క్రిస్టియన్ కాదా? సనాతన ధర్మ పరిరక్షకుడినని చెప్పుకునే పవన్‌ను ఎందుకు క్రిస్టియన్ అనరు?" అని నిలదీశారు.

టీటీడీలో కల్తీ నెయ్యి వివాదంపై కూడా భూమన స్పందించారు. చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యికి మూలాలు పడ్డాయని ఆరోపించారు. తాను టీటీడీ చైర్మన్‌గా నిబంధనల్ని సడలించలేదని, పైగా కఠినతరం చేశానని స్పష్టం చేశారు. "నా హయాంలో నిబంధనలు కఠినతరం చేశాకే ఏఆర్ డైరీ వంటి సంస్థలు వచ్చాయి. నిబంధనలు సులభతరం చేయడం వల్ల ఒక్క డైరీ సంస్థ అయినా ప్రయోజనం పొందిందని నిరూపించగలరా?" అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో భాగంగానే కొన్ని మార్పులు జరిగాయని వివరించారు. తన హయాంలో జరిగినంత హైందవ ధర్మ ప్రచారం ఏ ఒక్కరి పాలనలో జరగలేదని, ఈ విషయంపై చర్చకు సిద్ధమని భూమన సవాల్ విసిరారు.
Bhuma Karunakar Reddy
Chandrababu Naidu
Nara Lokesh
Pawan Kalyan
TTD
Christian allegations
Hindu traditions
Andhra Pradesh politics
TTD ghee controversy
YSRCP

More Telugu News