8న రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి .. ముఖ్యఅతిధిగా మంత్రి నారా లోకేశ్

Nara Lokesh to Attend Bhakta Kanakadasa Jayanti as State Festival
  • అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి ప్రధాన ఉత్సవం
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
  • సామాజిక సంస్కర్తగా కనకదాసు సేవలకు గుర్తింపుగా నిర్ణయం
భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె వెల్లడించారు.
 
రాష్ట్ర స్థాయి ప్రధాన ఉత్సవాన్ని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆమె పేర్కొన్నారు. కేవలం ఒకచోటే కాకుండా, అన్ని జిల్లాల్లోనూ భక్త కనకదాస జయంతిని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసినట్లు సవిత వివరించారు.
 
భక్త కనకదాస ఒక సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలో నెలకొన్న అసమానతలు, కుల వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం రగిలించారని కొనియాడారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు ఆయన చేసిన సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. అటువంటి మహనీయుడి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం సంతోషంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
 
గతేడాది కూడా అనంతపురంలో భక్త కనకదాస రాష్ట్ర స్థాయి జయంతిని నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Bhakta Kanakadasa Jayanti
Andhra Pradesh
AP Government
Anantapur
Kalyandurgam
BC Welfare
Minister Savitha
State Festival

More Telugu News