రష్మిక మందన్నకు మరో హిట్.. వంద కోట్ల క్లబ్ లో చేరిన బాలీవుడ్ మూవీ
- ఆయుష్మాన్-రష్మికల బాలీవుడ్ మూవీ 'థమ్మా'
- ఇప్పటి వరకు మొత్తం రూ. 104.60 కోట్లకు చేరిన కలెక్షన్లు
- ఈ సినిమా పిల్లలకు బాగా నచ్చిందని ఆనందం వ్యక్తం చేసిన ఆయుష్మాన్
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ మ్యాడాక్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించారు. 'స్త్రీ', 'స్త్రీ 2', 'భేదియా', 'ముంజ్యా' చిత్రాల తర్వాత మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో వచ్చిన ఐదో సినిమా ఇది. ఇందులో అలోక్ గోయల్ అనే జర్నలిస్టు పాత్రలో ఆయుష్మాన్ ఖురానా నటించగా, రక్తపిశాచి (వాంపైర్) అయిన తాడక పాత్రలో రష్మిక మందన్న కనిపించింది. వీరిద్దరి మధ్య నడిచే విభిన్నమైన ప్రేమకథే ఈ సినిమా.
ఈ చిత్రం తన కెరీర్లోని అతిపెద్ద కమర్షియల్ హిట్స్లో ఒకటిగా నిలవడంపై హీరో ఆయుష్మాన్ ఖురానా ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా పిల్లలను బాగా ఆకట్టుకోవడం తనను ఎంతగానో సంతోషపరిచిందని ఆయన అన్నారు. "థమ్మాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇది పిల్లలకు నచ్చడం. నా కెరీర్లో పిల్లలు ఇష్టపడిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమాలోని స్పెషల్ ఎఫెక్ట్స్, కథనం పిల్లలకు అనుకూలంగా ఉంటాయి. నా పిల్లలకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది" అని తెలిపారు. ఈ చిత్రంలో పరేశ్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఫైసల్ మాలిక్, గీతా అగర్వాల్ శర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.